హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు డిమాండ్ అంటే వేసవి కాలమే గుర్తుకొస్తుంది. రాష్ట్రంలో అత్యధిక డిమాండ్ ఎండాకాలంలోనే నమోదవుతుంది. ఈ ఏడాది వేసవి (మార్చి)లో గరిష్ఠంగా 14,167 మెగావాట్ల విద్యుత్తు వినియోగం నమోదైంది. కానీ, ఈ ఏడాది వర్షాకాలంలోను విద్యుత్తుకు భారీ డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే డిమాండ్ 12,317 మెగావాట్లకు చేరింది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత వానాకాలంలో ఇదే అత్యధిక డిమాండ్.
తెలంగాణలో ఏటా మార్చి, అక్టోబర్ నెలల్లో అత్యధికంగా విద్యుత్తు వినియోగం అవుతున్నది. కానీ, ఈసారి జూలైలోనే పీక్కు చేరడం గమనార్హం. రాష్ట్రంలో వ్యవసాయ విస్తీర్ణం పెరగడం, గ్రేటర్ హైదరాబాద్తోపాటు జిల్లా కేంద్రాల్లో పరిశ్రమలు విస్తరించడం విద్యుత్తు డిమాండ్ పెరుగుదలకు కారణమని అధికారులు చెప్తున్నారు. అయితే విద్యుత్తు వినిమయం ఎంతున్నా సరఫరాకు ఇబ్బంది లేదని, డిమాండ్కు తగ్గట్టుగా విద్యుత్తు సరఫరా చేయగలమని స్పష్టం చేస్తున్నారు.