హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సవరణ బిల్లు-2022ను వెంటనే రద్దుచేయాలని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ (ఏఐఎఫ్ఈఈ) 16వ జాతీయ సదస్సు తీర్మానించింది. లేనిపక్షంలో ఉద్యమాలకు వెనకాడబోమని హెచ్చరించింది. హైదరాబాద్ ఎర్రగడ్డలోని టీఎస్ జెన్కో ఆడిటోరియంలో శనివారం ప్రారంభమైన రెండు రోజుల సదస్సులో భాగంగా ఆదివారం పలు తీర్మానాలను ఆమోదించారు. సదస్సు సందర్భంగా భారీ ర్యాలీతోపాటు బహిరంగ సభ నిర్వహించారు. సంఘం నేతలతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి పలువురు విద్యుత్తు రంగ ప్రముఖులు సదస్సులో పాల్గొన్నారు.