Electric Vehicles | హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) జోరు కొనసాగుతున్నది. సంప్రదాయ ఇంధనాలకు భిన్నంగా వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై మక్కువ చూపుతున్నారు. దీంతో ఈ ఏడాది నవంబర్ వరకు ఈవీల సంఖ్య 46,000 దాటిపోయింది. ఇందులో 8,000 పైచిలుకు కార్లు కాగా, మిగిలినవి స్కూటర్లు, బైక్లు ఉన్నాయి. గత రెండేండ్లుగా ఏటా 18 నుంచి 20 వేల వాహనాల పెరుగుదల చోటుచేసుకుంటుండటంతో త్వరలోనే ఈవీల సంఖ్య 50 వేలు దాటిపోయే అవకాశం ఉన్నది. 2020లో రాష్ట్ర ప్రభుత్వం ఈవీ పాలసీ (2020-2023)ని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఈవీల విక్రయాల్లో పెరుగుదల గణనీయంగా కనిపించింది. ఈవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఈవీ పాలసీ కింద 2 లక్షల ద్విచక్ర వాహనాలు, 5,000 ఈ-కార్లకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి 100 శాతం మినహాయింపు ఇస్తున్నారు. టీఎస్ఆర్టీసీ కూడా క్రమంగా బస్సుల స్థానంలో ఈ-బస్సులను ప్రవేశపెట్టాలని సంకల్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,000 ఈ-బస్సులను ప్రవేశపెట్టాలని, 2025 నాటికి వీటి సంఖ్యను 3,500కు పెంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నది. ఇప్పటికే మొదటి విడుతలో 50 బస్సులను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో పెరుగుతున్న ఈవీలకు తగ్గట్టుగా టీఎస్ రెడ్కో సైతం బ్యాటరీ చార్జింగ్ స్టేషన్ల వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 150 చార్జింగ్ కేంద్రాలు ఉండగా, త్వరలోనే వీటి సంఖ్యను 200కు చేర్చాలని రెడ్కో లక్ష్యంగా పెట్టుకున్నది.
దేశవ్యాప్తంగానూ భారీగా ఈవీల అమ్మకాలు
దేశవ్యాప్తంగానూ ఈవీల విక్రయాల జోరు కొనసాగుతున్నది. ఇప్పటివరకు దేశంలో 23,37,761 ఈవీల విక్రయాలు జరిగినట్టు జేఎంకే రీసెర్చ్ సంస్థ తెలిపింది. ప్రస్తుత ఏడాదే 12 లక్షలకు పైగా వాహనాలు అమ్ముడైనట్టు వెల్లడించింది. ఇందులో 60 శాతం వాటా ద్విచక్ర వాహనాలది కాగా, ప్యాసింజర్ 3 వీలర్ వాటా 29 శాతం. మిగిలిన వాటా కార్లది. ఈ ఏడాది ఈవీల విక్రయాలు సాగించిన టాప్-5 రాష్ర్టాల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్ తదితర రాష్ర్టాలు ఉన్నాయి. 2022తో పోల్చుకుంటే బైక్ల విక్రయాలు ఈ ఏడాది 210 శాతం పెరగగా, 3 వీలర్స్, ఇతక కమర్షియల్ వాహనాల విక్రయాలు 126 శాతం పెరిగినట్టు జేఎంకే తెలిపింది.
అలాగే, ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లోనూ 150 శాతం పెరుగుదల నమోదైనట్టు పేర్కొన్నది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ వాహనాల కన్నా ఈవీల ధరలు కనీసం 2-3 లక్షలు అధికంగా ఉన్నాయి. దీంతో కొత్తగా వాహనాలు కొనాలనుకునేవారు వెనుకంజ వేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు పెట్టే ఆ డబ్బేదో పెట్రోల్కు పెట్టవచ్చని ఆలోచిస్తున్నారు. అయితే, రానున్న రోజుల్లో బ్యాటరీల తయారీ టెక్నాలజీ మరింత పెరిగి, ధరలు తగ్గితే ఈవీల వైపు మొగ్గు చూపొచ్చని వినియోగదారులు ఆలోచిస్తున్నారు.