Election Code | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకావడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. క్రమంలో పోలీసులు నగరంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. బంగారం, వెండితో పాటు నగదు, ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన కుక్కర్లను తనిఖీలో పట్టుకున్నారు. నిజాం కళాశాల ఎదుట పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానం వచ్చిన వాహనాల్లో సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో 7.50 కిలోల బంగారం, 300 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు.
సరైన పత్రాలు చూపకపోవడంతో బంగారాన్ని పట్టుకున్నారు. అలాగే చందానగర్ పరిధి తారానగర్లో వాహనాల తనిఖీల్లో 5.56 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు రెండు బైక్లను సీజ్ చేశారు. అలాగే రంగారెడ్డి జిల్లా పరిధిలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో రూ.11.50లక్షలు పట్టుబడ్డాయి. ఫరూక్నగర్ మండలం రాయికల్ టోల్ప్లాజా వద్ద నగదును సీజ్ చేశారు. బైక్పై వెళ్తున్న షాద్నగర్కు చెందిన అశోక్ అనే వ్యక్తి వద్ద నగదును గుర్తించారు. డబ్బుకు సంబంధించిన సరైన పత్రాలను చూపించకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు.
పత్రాలను చూపిస్తే నగదును తిరిగి అందజేస్తామని పోలీసులు తెలిపారు. అలాగే వనస్థలీపురం పోలీస్స్టేషన్ పరిధిలోని ఆటోనగర్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా రూ.5.14లక్షలు పట్టుబడ్డాయి. సీఐ జలంధర్రెడ్డి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలోని గోపన్పల్లితండాలో వంటకు వినియోగించే కుక్కర్లను పోలీసులు పట్టుకున్నారు. కుక్కర్ బాక్సులపై శేరిలింగంపల్లి కాంగ్రెస్ నేత మారబోయిన రఘునాథ్ యాదవ్ పేరుతో సిద్ధంగా ఉన్న 90 కుక్కర్లను పట్టుకున్నారు. ఫిలింనగర్లో మద్యం సీసాలను పట్టుకున్నారు.