తిరుమల, మార్చి 5 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్లో ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకునేవారు సేవకు 72 గంటల ముందు కొవిడ్ పరీక్ష చేయించుకున్న రిపోర్టు తీసుకొస్తేనే అనుమతిస్తామని టీటీడీ ఈవో కేఎస్ జవహర్రెడ్డి స్పష్టంచేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం జవహర్రెడ్డి మీడియా తో మాట్లాడారు. తిరుమలలో ఉగాది నుంచి శ్రీవారి ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గతంలో వెల్లడించిన విషయాన్ని గుర్తుచేశారు. అలిపిరిలో రెండుచోట్ల 2 వేల వాహనాలు, తిరుమలలో రెండుచోట్ల 1,500 వాహనాలు పార్క్ చేసేలా మల్టీలెవల్ పార్కింగ్ సముదాయాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. టీటీడీ కల్యాణ మండపాల లీజు కాలాన్ని 3 ఏండ్ల నుంచి 5 ఏండ్లకు, ఆ తర్వాత మరో రెండేండ్లు పొడిగించాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. భవిష్యత్లో విద్యుత్తుతో నడిచే వాహనాలను మాత్రమే తిరుమలకు అనుమతించేలా ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. 150 విద్యుత్తు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల పోస్టర్ను టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. తిరుపతి పరిపాలన భవనంలోని ఈవో చాంబర్లో ఈ కార్యక్రమం జరిగింది. మార్చి 11 నుంచి 21 దాకా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో జేఈవో సదాభార్గవి, హైదరాబాద్ శ్రీవారి ఆలయ సలహామండలి చైర్మన్, టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులు గోవిందహరి, డోనర్ త్రినాథ్బాబు, డిప్యూటీ ఈవో రమేశ్బాబు పాల్గొన్నారు.