హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ఒకటి కాదు, రెండు కాదు.. 85 శాతం గోల్డ్ మెడల్స్ అమ్మాయిలకే. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వివిధ కోర్సుల్లో అమ్మాయిల ప్రతిభ ఇదీ. 2018-20కు సంబంధించి మొత్తం 80 మంది విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించగా, వారిలో 68 పతకాలు బాలికలే సాధించటం విశేషం. బాలురకు కేవలం 12 పతకాలే దక్కాయి. అదీకాక, 343 పీహెచ్డీ అవార్డులు పొందేవారిలో 148 మంది అమ్మాయిలే. ఎంటెక్, ఎంఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీఈసెట్-21లో 72వేల మంది పరీక్షకు హాజరుకాగా వారిలో 50వేల మంది వరకు బాలికలే ఉన్నారు. ఓయూలోని గెస్ట్హౌజ్లో సోమవారం నిర్వహించిన యూనివర్సిటీ 81వ స్నాతకోత్సవ సన్నాహాక సమావేశంలో వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27న ఠాగూర్ ఆడిటోరియంలో స్నాతకోత్సవం నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రక్షణ శాఖ ఆర్అండ్డీ సెక్రటరీ, ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ జీ సతీష్రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శ్రీరామ్ వెంకటేశ్, పాల్గొన్నారు.