హైదరాబాద్/సిటీబ్యూరో, జనవరి 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సంస్థానం 7వ (ఆఖరి) నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహద్దూర్ మనుమడు ముకర్రంజా (89) కన్నుమూశారు. టర్కీలోని ఇస్తాంబుల్లో కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఇస్తాంబుల్ నుంచి ప్రత్యేక విమానంలో ముకర్రంజా భౌతికకాయాన్ని మంగళవారం సాయంత్రం 5 గంటలకు శంషాబాద్కు, అకడి నుంచి చౌమొహల్లా ప్యాలెస్కు తరలించనున్నట్టు ముకర్రంజా ట్రస్ట్ ప్రతినిధి ఎంఏ ఫైజ్ఖాన్ తెలిపారు. ముకర్రంజా భౌతికకాయానికి నివాళులర్పించడానికి మంగళవారం రాత్రి 7.45 నుంచి 9 గంటల మధ్య నిజాం కుటుంబసభ్యులు, ఆ కుటుంబానికి చెందిన వివిధ ట్రస్టీల, సంస్థల ప్రతినిధులను అనుమతిస్తారని పేర్కొన్నారు. బుధవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు సాధారణ ప్రజలు నివాళులర్పించవచ్చని వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు చౌమొహల్లా ప్యాలెస్ నుంచి మకా మసీదు వరకు అంతిమయాత్ర ప్రారంభం కానున్నది. ముకర్రంజా తండ్రి మీర్ హిమాయత్ అలీఖాన్ ఆజంజా బహదూర్ సమాధి పకన (అసఫ్ జాహీ సమాధుల వద్ద) ముకర్రంజా అంత్యక్రియలను బుధవారం సాయంత్రం ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు.
నామమాత్రపు 8వ నిజాంగా..
1933లో ఫ్రాన్స్లో ప్రిన్స్ ఆజమ్జా, యువరాణి దుర్రు షెహావర్ దంపతులకు ముకర్రంజా జన్మించారు. ఈయన పూర్తిపేరు మీర్ బార్కత్ అలీఖాన్ ముకర్రంజా. 1948లో ఇండియన్ యూనియన్ విలీనమయ్యే వరకు నిజాం రాజవంశం రాష్ర్టాన్ని పాలించింది. 1967 ఫిబ్రవరిలో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మరణించిన తర్వాత ముకర్రంజాకు 1967 ఏప్రిల్ 6న 8వ అసఫ్జాగా (నామమాత్రపు 8వ నిజాంగా) పట్టాభిషేకం చేశారు. 1971లో రాజభరణాలు రద్దు అయ్యే వరకు 8వ నిజాం నవాబుగా ముకర్రంజాకు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు ఉండేది. 1977 ఎమర్జెన్సీ సమయంలో ముకర్రంజా ఆస్ట్రేలియా వెళ్లారు. అక్కడ కొంతకాలం, తర్వాత టరీకి పయనమై జీవితాంతం అకడే ఉన్నారు. తన చివరి కోరిక మేరకు స్వదేశంలోనే ఖననం చేయాలనే సూచన మేరకు ఆయన భౌతికకాయాన్ని కుటుంబీకులు హైదరాబాద్కు తీసుకొస్తున్నట్టు సమాచారం.
విద్యాధికుడు ముకర్రంజా
డెహ్రాడూన్లోని డూన్ పాఠశాలలో పాఠశాల విద్య, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, లండన్ సూల్ ఆఫ్ ఎకనమిక్స్, రాయల్ మిలిటరీ అకాడమీ శాండ్హర్ట్స్లో ఉన్నత విద్యను ముకర్రంజా పూర్తిచేశారు. మాతృభూమిపై ప్రేమతో ప్రతి ఏటా హైదరాబాద్ వచ్చి తన పూర్వీకుల జ్ఞాపకాలను నెమరువేసుకునేవారని స్నేహితులు తెలిపారు. 1980 నాటి వరకు ముకర్రంజా దేశంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగారని పేర్కొన్నారు.
అధికారికంగా అంత్యక్రియలు..
ముకర్రంజా అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో సోమవారం ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఏకే ఖాన్తోపాటు పలువురు ఉన్నతాధికారులు, హైదరాబాద్ అడిషనల్ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) విక్రమ్సింగ్ మాన్, రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం, ఇతర అధికారులు చౌమొహల్లా ప్యాలెస్ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. బుధవారం వేల మంది చౌమొహల్లా ప్యాలెస్తోపాటు అసఫ్జాహీ సమాధుల ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ పోలీసులు కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ను మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది.
ముకర్రంజా మృతికి సీఎం కేసీఆర్ సంతాపం
హైదరాబాద్ సంస్థానం ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహద్దూర్ మనుమడు ముకర్రంజా మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిజాం వారసుడిగా, పేదల కోసం విద్య, వైద్యరంగాల్లో ముకర్రంజా చేసిన సామాజిక సేవలకు గుర్తుగా, వారి అంత్యక్రియలను అత్యున్నతస్థాయి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ముకర్రంజా మృతికి హోం మంత్రి మహమూద్ అలీ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.