హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఒక శాతం చందాతో ఆరోగ్యపథకాన్ని (ఈహెచ్ఎస్) అమలుచేయాలని టీఎన్జీవో, పీఆర్టీయూటీఎస్ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. పూర్తిగా నగదు రహిత విధానంలో అమలు చేయాలని విజ్ఞప్తి చేశాయి. సోమవారం ఆయా సంఘాల నేతలు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, హెల్త్ సెక్రటరీ రిజ్వీని వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఆరోగ్యపథకం అమలు కోసం ఉద్యోగుల మూలవేతనంలో ఒకశాతం చందా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం సైతం తన వాటాగా ట్రస్ట్కు ఒకశాతం చందాను చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై మంత్రి హరీశ్రావు సానుకూలంగా స్పందించినట్టు టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, పధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ తెలిపారు.
జీవో-317 అమలులో భార్యాభర్తల బదిలీల ప్రక్రియ చేపట్టాలని, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, పెండింగ్ పీఆర్సీ జీవోలను విడుదల చేయాలని, 2023 జూలై నుంచి అమలయ్యేలా నూతన పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలని విన్నవించారు. మంత్రిని కలిసినవారిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్, అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, ఉపాధ్యాయ సంఘాల నేతలు సీ జగదీశ్, ఎండీ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. ఇదే అంశంపై టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కావలి అశోక్కుమార్, ప్రధాన కార్యదర్శి కటకం రమేశ్ మంత్రి హరీశ్రావును విడిగా కలిసి వినతిపత్రం సమర్పించారు.