పెగడపల్లి, జూన్ 20: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ‘మన ఊరు -మన బడి’కి శ్రీకారం చుట్టారని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం జడ్పీ పాఠశాలలో, పెగడపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పెగడపల్లిలో రూ.10 లక్షలతో నిర్మించే ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు, పాఠశాల విద్యార్థులకు పలకలు, నోటు పుస్తకాలు పంపిణీచేశారు. చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మన ఊరు మన బడి పథకం కింద పెగడపల్లి మండలంలో 13 పాఠశాలలను ఎంపిక చేశామని, వాటి అభివృధ్దికి రూ.2.50 కోట్లు మం జూరు చేసినట్టు తెలిపారు. ప్రభుత్వ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు.