హైదరాబాద్, సెప్టెంబర్ 6 : రాష్ట్రంలో ఎంపీటీలకు సరైన గౌరవ మర్యాదలు దక్కేటట్లు చూడటంతోపాటు వారి సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం, ఆ సంఘం జిల్లాల అధ్యక్షులతో ఆయన హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు చెప్పిన సమస్యలను సావధానంగా విన్నారు. ఆయా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.
అలాగే ఎంపీటీసీలకు సరైన గౌరవం దక్కేలా చేస్తామన్నారు. ఈ విషయాలపై ఇప్పటికే తనతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు కవిత, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి లు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలీస్తే మన రాష్ట్రంలోనే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఎక్కువ గౌరవం, మర్యాదలు దక్కుతున్నాయన్నారు.
గౌరవ వేతనం, అభివృద్ధి పనులు, నిధులు, విధులు మన రాష్ట్రంలోనే బాగున్నాయని చెప్పారు. కాగా, ఎంపీటీసీల సంఘం తరపున మంత్రికి 20 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని వారు అందచేశారు.
సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడీల కుమార్ గౌడ్, రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్ సభ్యుడు, కొడకండ్ల ఎంపీటిసీ, సంఘం రాష్ట్ర కార్యదర్శి అందె యాకయ్య, రవి, వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన ఆ సంఘం జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.