సిద్ధిపేట : మోడల్ పోలీస్ కన్వెన్షన్ సెంటర్ ద్వారా వచ్చే ప్రతి రూపాయి పోలీసుల సంక్షేమానికే వెచ్చిస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రూ.10కోట్లతో సిద్ధిపేట పట్టణంలో నిర్మించిన మోడల్ పోలీస్ కన్వెన్షన్ సెంటర్ను మహమూద్ అలీ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, డీజీపీ మహేందర్రెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడారు. రాత్రి పగలు తేడా లేకుండా పని చేసే శాఖనే పోలీస్శాఖ అన్నారు.
ఇలాంటి పోలీసులకు ఏదైనా చేయాలనే ఆలోచన ఉండేదని, నా కలల ప్రతిరూపమే మోడల్ పోలీస్ కన్వెన్షన్ సెంటర్ అన్నారు. సీపీ జోయల్ డేవిస్ సారథ్యంలో నా కల సాకారమైందంటూ హర్షం వ్యక్తం చేశారు. మోడల్ పోలీస్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం వేగంగా పూర్తి చేసిన సీపీ, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సిద్ధిపేట మోడల్ పోలీస్ కన్వెన్షన్ సెంటర్ తొలి అడుగు మాత్రమేనని, ప్రతి జిల్లాలో ఇలాంటి సెంటర్ నిర్మిస్తామన్నారు. పోలీస్ శాఖకు మంజూరైన పెట్రోల్ బంకుల ఏర్పాటుకు అనువైన స్థలాలను త్వరలోనే గుర్తిస్తామన్నారు. పోలీస్ సంక్షేమ నిధికి మరిన్ని ఫండ్ జమ అయ్యేలా కృషి చేస్తామన్నారు.