హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): కొత్త తరం ఇంటర్నెట్ టెక్నాలజీగా చెప్తున్న ‘వెబ్ 3.0’ రెగ్యులేటరీ శాండ్ బాక్స్ పాలసీని సమర్థంగా అమలు చేసే బాధ్యతను తెలంగాణ ఐటీ శాఖ చేపట్టింది. ఇటీవల బెంగళూరులో అతిపెద్ద వెబ్ 3.0, ఎథెరియం హ్యాకథాన్ను నిర్వహించారు. ఆ వేదికపై తెలంగాణ ఐటీశాఖ దేశంలోనే తొలిసారి వెబ్ 3.0 రెగ్యులేటరీ శాండ్ బాక్స్ పేరుతో సరికొత్త విధానాన్ని ఆవిష్కరించింది. వెబ్ 3.0 ఎకోసిస్టంలో వివిధ కంపెనీలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలు తమ ఉత్పత్తులను పరీక్షించుకుని, సంబంధిత నియంత్రణాధికారుల నుంచి ధ్రువీకరణలను పొందేందుకు ఇది దోహదం చేస్తుంది. కొన్ని జాతీయ నియంత్రణ సంస్థలు సైతం తమ రెగ్యులేటరీ శాండ్ బ్యాక్స్తో చేతులు కలిపేందుకు ముందుకు వచ్చినట్టు తెలంగాణ ఐటీ శాఖ అధికారులు తెలిపారు. బెంగళూరులో జరిగిన వెబ్ 3.0, ఎథెరియం హ్యాకథాన్లో 30 దేశాలకు చెందిన 2 వేల మంది డెవలపర్లు పాల్గొని 459 ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఇదే తరహా కార్యక్రమాన్ని ‘ఈటీహెచ్ ఫర్ ఆల్’ పేరుతో ఫిబ్రవరి 4న హైదరాబాద్లో నిర్వహించేందుకు తెలంగాణ ఐటీ శాఖ సిద్ధమవుతున్నది.
ఐదుగురు నిపుణులతో గవర్నింగ్ కౌన్సిల్
వెబ్ 3.0 రెగ్యులేటరీ శాండ్ బాక్స్ను సమర్థంగా అమలు చేసేందుకు పరిశ్రమకు చెందిన ఐదుగురు నిపుణులతో గవర్నింగ్ కౌన్సిల్ను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ఐటీ శాఖ పరిధిలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ డైరెక్టర్ రమాదేవి లంక వెల్లడించారు. వెబ్ 3.0 టెక్నాలజీ ఆధారంగా తమ ఉత్పత్తులను ప్రత్యక్ష వాతావరణంలో పరీక్షించాలనుకునే స్థానిక, అంతర్జాతీయ సంస్థలు, ఆవిష్కర్తలు శాండ్ బాక్స్ పాలసీలో భాగస్వాములు కావచ్చని తెలిపారు. కొత్త టెక్నాలజీలకు సంబంధించిన ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉన్నదని, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ఆవిష్కరణలను రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ప్రోత్సహిస్తున్నారని ఆమె వివరించారు.