హైదరాబాద్ : విశ్వ విద్యాలయాల్లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి, అవకాశాల కోసం బాహ్య ప్రపంచంలో అడుగుపెట్టే సమయంలో విద్యార్థులు ఆత్మవిశ్వాసం ఉండేలా బోధన జరుగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చదువులు పూర్తయ్యాక ఉద్యోగం, ఉపాధి లభిస్తుందన్న విశ్వాసం, నమ్మకాన్ని కలిగించాలని ఉప కులపతులను కోరారు. నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో యూనివర్సిటీ వైస్ చాన్సెలర్ల సమావేశం జరిగింది. కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
మానవ వనరులను అభివృద్ధి చేయంలో విశ్వవిద్యాలయాలు కీలకపాత్ర పోషించాలని సూచించారు. విద్యార్థులు లక్ష్యాన్ని సాధించేలా ఖచ్చితమైన సంకల్పాన్ని, అడ్డకులను అధిగమించే సామర్థ్యాన్ని పెంపొందించాల్సిన బాధ్యత యూనివర్సిటీల అధ్యాపకులదేనన్నారు. విద్య, పరిశోధన, ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే బాధ్యతలను విశ్వ విద్యాలయాలు విస్మరించొద్దని సూచించారు. యూనివర్సిటీల్లో పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అవే వర్సిటీలకు కొలమానంగా నిలుస్తున్నాయన్నారు. భవిష్యత్ సమాజంపై ప్రభావాన్ని చూపే రంగాలను గుర్తించి ఆయా కోర్సులను రూపొందించుకోవాలని, ఆయా రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించాలని మంత్రి కోరారు.
అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ముఖ్యమైన పరిశోధనా కార్యక్రమాలకు నాయకత్వం వహించడానికి శాస్త్రీయ సంస్థలు, ఇతర ప్రభుత్వ విభాగాలతో విశ్వ విద్యాలయాలు సరైన నెట్ వర్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు, ఉద్యోగావకాశాలకు కావాల్సిన శిక్షణను ఇవ్వడానికి యూనివర్సిటీ స్థాయిల్లో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయాలని కోరారు. త్వరలోనే పోటీ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నందున యూనివర్సిటీలోని విద్యార్థులు సిద్ధమయ్యేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, ఇందుకయ్యే నిధులను ప్రభుత్వం వెంటనే అందజేస్తుందని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలోని యూనివర్సిటీలకు పూర్వవైభవం తీసుకురావడంతో పాటు ఉత్తమ విశ్వ విద్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. విశ్వ విద్యాలయాల్లో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు వైస్ చాన్సెలర్లతో కమిటీని వేసి నివేదిక రూపొందిస్తామన్నారు. విద్యార్థులు పరిశోధనల వైపు ఆకర్షితులయ్యేలా జర్నల్స్ను అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకటరమణ, ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఉమర్ జలీల్ పాల్గొన్నారు.