సుల్తాన్బజార్, నవంబర్ 14: తల్లిదండ్రులు తమ పిల్లల్లో చిన్నప్పటి నుండే పఠనాసక్తిని పెంపొందించాలని విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శుభకార్యా లు జరిగినప్పుడు పూలబొకేలతో కాకుండా మంచి పుస్తకాలు అందించి శుభాకాంక్షలు తెలుపాలని సూచించారు. అఫ్జల్గంజ్లోని సెంట్రల్ లైబ్రరీలో సోమవారం ఆమె 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కావాల్సిన పుస్తకాలను కాగితంపై రాసి ఇస్తే వాటిని సమకూర్చే విధంగా రాష్ట్రంలో గ్రంథాలయాలను అభివృద్ధి చేసినట్టు చెప్పారు.
రాష్ట్రం నలుమూలల ఉన్న గ్రంథాలయాలను జిల్లా, మండల, నియోజకవర్గ స్థాయిలోని పాఠకుల అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మన ఊరు, మన బడి కార్యక్రమంలో భాగంగా ఐదు వేల పాఠశాలల్లో పిల్లల కోసం గ్రంథాలయాలను ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. గ్రంథాలయ ఉద్యోగులు, పింఛన్దారుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని, ఆరోగ్యకార్డులు మంజూరు చేయాలని కోరుతూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కొక్కుల దేవేందర్ ప్రతినిధి బృందం మంత్రికి వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల సౌలభ్యం కోసం పారిశ్రామిక విద్యావేత్తల సమాఖ్య అధ్యక్షుడు సుధీర్రెడ్డి రూ.11 లక్షల విలువ చేసే పుస్తకాలను మంత్రి సమక్షంలో గ్రంథాలయానికి అందజేశారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. విశ్రాంత గ్రంథపాలకులను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ ఆయాచితం శ్రీధర్, మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి, నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్నా రామ్మూర్తి, రాష్ట్ర కేంద్ర గ్రంథాలయాల ఇన్చార్జీ, ముఖ్య గ్రంథ పాలకులు పీవీజీ రాణి, గ్రంథాలయ శాఖ అధికారులు హరిశంకర్, కేసరి హనుమాన్ తదితరులు పాల్గొన్నారు.