TS CETs | హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో, ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉమ్మడి ప్రవేశ పరీక్షలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయా యూనివర్సిటీల వీసీలు, ప్రవేశ పరీక్షల కన్వీనర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి లోపాలు లేకుండా ప్రవేశ పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని కన్వీనర్లను, అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల లోకేషన్లను గుర్తించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలన్నారు. హాల్ టికెట్పై ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.