గూడూరు, ఏప్రిల్ 8 : ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలువాల్సిన విద్యాశాఖ అధికారి ఏసీబీకి చిక్కాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఓ ఉత్తమ ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్యపురం జడ్పీహెచ్ఎస్లో జరిగింది. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం.. గూడూరు మండలం వాగ్యాతండా పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు ఈ నెల 30న రిటైర్ అవుతున్నాడు. అతడు ముందస్తుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎంఈవో రవికుమార్కు తన సర్వీస్బుక్, ఇతర పత్రాలను 4 నెలల క్రితమే హైదరాబాద్ ఆడిటింగ్ ఆఫీస్కు పంపించమని కోరుతూ ఆధారాలు అందజేశారు.
ఫైల్ను హైదరాబాద్కు పంపాలంటే రూ.45వేలు ఖర్చవుతాయని, అయోధ్యపురం పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు చంద్రమౌళిని కలిసి, డబ్బులు ఇవ్వాలని ఉపాధ్యాయుడికి ఎంఈవో సూచించారు. దీంతో ఉపాధ్యాయుడు రూ.15 వేలు ఇస్తానని ఒప్పుకొని వరంగల్లోని ఏసీబీ ఆఫీసులో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే బుధవారం అయోధ్యపురం ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా కూడా పనిచేస్తున్న ఎంఈవో రవికుమార్, ఉపాధ్యాయుడు చంద్రమౌళిని కలిసి బాధితుడు రూ.15వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇద్దరిని ఏసీబీ కోర్టుకు తరలించినట్టు డీఎస్పీ తెలిపారు.