హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): అన్ని వస్తువులను చైనా నుంచి దిగుమతి చేసుకోవటమేనా? దేశంలో చైనా బజార్ లేని ప్రాంతం ఉన్నదా? అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అడుగుతుంటే మేధావి వర్గాలు ఆలోచనలో పడ్డాయి. ప్రజా రాజకీయాలు ప్రారంభం కావాలని, ప్రజలే కేంద్ర బిందువులు కావాలని అంటుంటే యువత ఉత్తేజితమైంది. ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిశోర్బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ పార్థసారథి సహా పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్ సమక్షంలో సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఒక్కో అంశంపై వివరణ ఇస్తుంటే, ఒక్కో ప్రశ్నను లేవనెత్తుతుంటే, ఒక్కో సమస్యను నిలదీస్తుంటే ప్రజలు ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయారు.
సీఎం ప్రసంగాన్ని చూసి ఏపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాలు, కుల సంఘాల ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. ‘కేసీఆర్ అంటే ఏదో అలా.. అలా మాట్లాడతారని తెలుసు గానీ, ఇలా కట్టిపడేసే రీతిలో మాట్లాడి, అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్తారని అస్సలు ఊహించలేదండి’ అని ఏపీ నుంచి వచ్చిన నేతలు చెప్పారు. కేసీఆర్కు తెలంగాణపై, మహా అయితే ఏపీ రాజకీయాలపై అవగాహన ఉంటుందని అనుకున్నాం గానీ, భారత రాజకీయాలు, ప్రజల స్థితిగతులు, వారికి ఏం చేయాలన్న అంశంపై అద్భుతమైన ఆలోచనా విధానం ఉన్నదని కొనియాడారు.
మెదళ్లకు ఆలోచనలు పుట్టించారు!
అన్ని వనరులున్నా మనకు ఏమీ దక్కటం లేదని సీఎం అంటుంటే.. అవును కదా! అని సభికులు నిట్టూర్చారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసమే బీఆర్ఎస్ వస్తున్నదని చెప్తుంటే.. పార్టీ ఎజెండా ఎంత సమర్థమైనదో అర్థమైంది. కేసీఆర్ ప్రశ్నలతో అక్కడున్నవారంతా ఆలోచనలో పడిపోవటంతో కాసేపు నిశ్శబ్ధ వాతావరణం అలుముకొన్నది. ఇక, దేశాభివృద్ధి, సంక్షేమంపై ఆయన తనదైన శైలిని మరోసారి చూపించారు. దళితబంధును దేశమంతా అమలు చేస్తామని ప్రకటించటంతో చప్పట్లు, ఈలలతో ఆ ప్రాంగణం దద్దరిల్లింది. ఈ ప్రకటన కచ్చితంగా దేశ రాజకీయాల్లో పెను సంచలనమే సృష్టిస్తుందని అక్కడున్నవారంతా అనటం గమనార్హం.
తెలంగాణ మాడల్తో విద్యుత్తు సమస్య తీరుస్తామన్న ప్రకటన నిపుణులను సైతం ఆలోచించేలా చేసింది. కేంద్రంలోని మోదీ సర్కారు ప్రైవేటీకరించే ప్రతి సంస్థను మళ్లీ ప్రభుత్వపరం చేస్తామని చెప్పటం ఆయన నిబద్ధతకు తార్కాణం అని అక్కడున్నవారు చర్చించుకొన్నారు. ముఖ్యమంత్రి దళితబంధు, దేశమంతా ఉచిత విద్యుత్తు ఇస్తామని చెప్పగానే జై కేసీఆర్.. జై బీఆర్ఎస్ నినాదాలు, ఈలలు, కేకలతో తెలంగాణ భవన్ మార్మోగింది.
బోయినపల్లి వినోద్తో భేటీ
బీఆర్ఎస్లో చేరేందుకు వచ్చిన ఏపీ నేతలు హైదరాబాద్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ, అక్కడి రాజకీయ పరిస్థితులు తదితర అంశాలపై చర్చించారు. విజయవాడ, నూజివీడు ప్రాంతాలకు చెందిన వంశీరావు, సతీశ్రావు నేతృత్వంలో పలువురు ఏపీ నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. వారంతా బీఆర్ఎస్లో చేరుతుండటంపై వినోద్కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము బీఆర్ఎస్లో చేరడం చాలా సంతోషంగా ఉన్నదన్నారు. తెలంగాణలో సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం అమలవుతున్న పథకాలు తమను ఆకర్షించాయని చెప్పారు. ఇలాంటి పాలనే తమకూ కావాలని బలంగా కోరుకున్నామని, బీఆర్ఎస్ రూపంలో ఆ అవకాశం వచ్చిందని తెలిపారు.