న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన వంటనూనెల ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. గడిచిన నెల రోజుల్లో కిలో వంటనూనె ధర రూ.8-10 వరకు తగ్గగా.. వచ్చే కొన్ని నెలల్లో మరో రూ.3-4 వరకు తగ్గే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వంటనూనెల దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో ధరలు క్రమంగా దిగొస్తున్నాయని ఎస్ఈఏ ప్రెసిడెంట్ అతుల్ చతుర్వేది తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో నూనెల ధరలు భారీగా పుంజుకున్నాయని, ముఖ్యంగా పామాయిల్, సోయా, సన్ఫ్లవర్ ఆయిల్ ధర చుక్కలనంటడంతో సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో వీటి ధరలు తగ్గుముఖం పట్టడంతోపాటు కేంద్రం దిగుమతి సుంకాన్ని తగ్గించడం కూడా ధరలు దిగిరావడానికి దోహదం చేసిందని చెప్పారు. దేశవ్యాప్తంగా సోయాబీన్ 120 లక్షల టన్నులు, పల్లి 80 లక్షల టన్నులు ఉత్పత్తి కావడంతో ధరలు దిగొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.