వాషింగ్టన్ : కరోనా థర్డ్ వేవ్ భయాలు, వైరస్ స్వభావాన్ని మార్చుకుంటున్న నేపథ్యంలో అమెరికా ఫార్మా దిగ్గజం వ్యాక్సిన్ మూడో డోసు వేసేందుకు సిద్ధమవుతున్నది. ఇందుకు అవసరమైన అనుమతి కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. మహమ్మారిని ఓడించేందుకు మూడో డోసు అవసరమని కంపెనీ పేర్కొంది. ఈ మేరకు కొవిడ్ టీకా కోసం రెగ్యులేటరీ అనుమతి తీసుకుంటామని ప్రకటించింది. మూడో మోతాదు వేయడంతో రెండు మోతాదులతో పోల్చితే యాంటీబాడీలు ఐదు నుంచి పది రెట్లు పెంచుతుందని కంపెనీ నిర్వహించిన ట్రయల్స్ మధ్యంతర ఫలితాల్లో గుర్తించారు. డేటాను దృష్టిలో పెట్టుకొని కంపెనీ అనుమతి కోరనుంది.
వాస్తవానికి టీకా మూడో డోసు మహమ్మారి బీటా వేరియంట్కు వ్యతిరేకంగా రక్షణ అందిస్తోంది. ఈ వేరియంట్ను మొదట దక్షిణాఫ్రికాలో గుర్తించారు. ఇది డెల్టా వేరియంట్ కంటే మరింత ప్రమాదకరమైందని నిపుణులు పేర్కొంటున్నారు. ఫైజర్ వ్యాక్సిన్ డెల్టా వేరియంట్కు వ్యతిరేకంగా పని చేస్తున్నా.. ప్రభావం తక్కువగా ఉంటోంది. డెల్టా వేరియంట్పై టీకా 64శాతం వరకు ప్రభావంతంగా ఉండగా.. ఇంతకు ముందటి రకాలపై 94శాతం సమర్థవంతంగా పని చేసింది. ఈ క్రమంలో ఫైజర్ మూడో మోతాదు కోసం అమెరికా రెగ్యులేటరీ అనుమతి కోరుతున్నది.