హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీచేసింది. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, గీతారెడ్డి, మాజీ ఎంపీ అంజన్కుమార్కు ఈడీ సమన్లు ఇచ్చింది. ఈనెల 10న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను ఈడీ సుదీర్ఘంగా విచారించిన విషయం తెలిసిందే.
కాగా, తమకు ఈడీ నుంచి ఎలాంటి నోటీలు అందలేదని షబ్బీర్ అలీ, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ వెల్లడించారు. నోటీసులు వస్తే విచారణకు హాజరవుతామని చెప్పారు. నేషనల్ హెరాల్డ్కు డొనేషన్ ఇచ్చిన మాట వాస్తవమేనని షబ్బీర్ అలీ అన్నారు. చెక్ రూపంలోనే ఆ పత్రిక నివారణకు నిధులు అందించినట్లు ప్రకటించారు. తాను కూడా విరాళం ఇచ్చానని అంజన్ కుమార్ అన్నారు.