దేశంలో ద్రవ్యోల్బణం గత 8 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ జీవితకాల కనిష్ఠానికి పడిపోయింది. దేశంలో అపారమైన ప్రతిభ ఉన్నది. మన సివిల్ సర్వీస్ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తుమమైనది. ఆ సివిల్ సర్వీస్ అధికారులకు పనిచేసే అవకాశం ఇస్తే ఈ దుస్థితి నుంచి దేశం బయటపడగలదు
-ఆర్థికవేత్త కౌశిక్ బసు
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ దిగజారిపోతున్నది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు.. ప్రణాళిక లేని పరిపాలన దేశానికి ముప్పుగా మారింది. నిరుద్యోగం, పేదరికం భరించలేనంతగా పెరిగాయి.. ఇదీ మన దేశంలోని మేధావుల అభిప్రాయం. ప్రపంచబ్యాంకు మాజీ ప్రధాన ఆర్థికవేత్త, కార్నెల్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ కౌశిక్ బసు సైతం ఇదే విషయాన్ని చెప్పారు. ‘భారతదేశంలో ద్రవ్యోల్బణం గత 8 ఏండ్లలో ఎన్నడూ లేనంత పెరిగింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి పడిపోయింది.
ప్రపంచంలోనే ఎక్కడా లేనంతగా నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయింది. కానీ భారతదేశంలో అపారమైన ప్రతిభ ఉన్నది. దేశంలోని సివిల్ సర్వీస్ వ్యవస్థ ప్రపంచంలోని అత్యుత్తుమమైనవాటిల్లో ఒకటి. అది నాకు అనుభవపూర్వకంగా తెలుసు. ఆ సివిల్ సర్వీస్ అధికారులకు పనిచేసే అవకాశం ఇస్తే ఈ దుస్థితి నుంచి దేశం బయటపడగలదు’ అని శనివారం ట్వీట్ చేశారు. అంతకుముందు శుక్రవారం కౌశిక్బసు ‘అమెరికాలో ద్రవ్యోల్బణం అత్యధికంగా ఉన్న ఈ సమయంలో డాలర్తో పోల్చితే రూపాయి బలపడుతుందని ఎవరైనా అనుకొంటారు. కానీ అందుకు విరుద్ధంగా రూపాయి విలువ మరింత పడిపోయింది. అంటే ద్రవ్యోల్బణాన్ని కూడా భారతదేశం దిగుమతి చేసుకొంటున్నది. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉన్నది’ అని ట్వీట్ చేశారు.
ప్రపంచ ఆర్థికవేత్తల్లో ప్రముఖుడిగా పేరున్న కౌశిక్ బసు, కొంతకాలంగా భారత ఆర్థిక వ్యవస్థను నిశితంగా పరిశీలిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థ పతనమవుతున్న తీరును ఆయన ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నారు. దీంతో బీజేపీ అనుకూల వర్గాలు సోషల్మీడియాలో కౌశిక్ బసును టార్గెట్ చేశాయి. అయినా ఆయన ఏమాత్రం వెనక్కు తగ్గకుండా వాస్తవాలను ప్రజలముందు ఉంచుతున్నారు. శనివారం నాటి ఆయన ట్వీట్ను మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.