హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఆర్థిక అక్షరాస్యతపై ప్రభుత్వం అవగాహన కల్పించనున్నది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నది. వచ్చే ఏడాది మార్చి నాటికి 2 లక్షల మహిళా సంఘాల్లోని 20 లక్షల మంది సభ్యులకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాలను చేపట్టనున్నారు.
ఆదాయం, వ్యయం, ఖర్చులను ప్లాన్ చేసుకోవడం, భవిష్యత్తు అవసరాలకు కోసం పొదుపు చేసుకోవడం, బీమా, పెన్షన్, కొత్త బ్యాంకింగ్ అలవాట్లు, సామాజిక భద్రతా పథకాలు, సురక్షితమైన పొదుపు విధానాలు, ఏ అవసరాల కోసం ఎలా అప్పులు చేయా లి, రుణాలు ఎక్కడ తీసుకోవాలి అనే అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఇందుకోసం 34 మంది మాస్టర్ ట్రైనర్లకు ఇటీవల బెంగళూరులోని రూరల్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (రూడ్సెట్)లో వారం రోజులపాటు శిక్షణ ఇచ్చా రు. వీరు ఒక్కో మండలంలో 10 మం దికి చొప్పున వారంపాటు శిక్షణ ఇచ్చి ట్రైనర్లుగా తయారు చేస్తారు. వీరు గ్రామాల కెళ్లి ఎస్హెచ్జీ సభ్యులకు శిక్షణ ఇస్తారు.
కుటుంబాల ఆర్థిక పరిపుష్ఠే లక్ష్యం
రాష్ట్రంలో మహిళా స్వయం సంఘాలకు స్త్రీనిధి ద్వారా బ్యాంకులు రూ.18 వేల కోట్ల వరకు రుణాలను అందిస్తున్నాయి. ఈ రుణాలను ఎస్హెచ్జీ సభ్యులు తమ స్వయం ఉపాధి పనులకు, వ్యాపారాలకు వినియోగిస్తున్నారు. తద్వారా వచ్చిన రాబడితో వారి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసుకునేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.