హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రజావైద్యం గణనీయంగా మెరుగుపడిందని ఆర్థిక, సామాజిక సర్వే-2023 వెల్లడించింది. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయని తెలిపింది. దీంతో ప్రభుత్వ దవాఖానలపై నమ్మకం పెరిగిందని చెప్పింది. ప్రభుత్వ దవాఖానల్లో 2021-22తో పోల్చితే 2021-22లో ఓపీ, ఐపీ, సర్జరీలు, ల్యాబ్ టెస్టులు ఇలా అన్ని విభాగాల్లోనూ గణనీయమైన వృద్ధి సాధించినట్టు పేర్కొన్నది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచే వైద్యారోగ్య రంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. భారీగా నిధులు కేటాయిస్తూ దవాఖానలను, వైద్యసేవలను మెరుగు పరుస్తున్నారు. దీంతో ఏటికేడు మెరుగైన ఫలితాలు నమోదవుతున్నాయి. ఆరోగ్య సూచీల్లో తెలంగాణ పైకి ఎగబాకింది. 19 పెద్ద రాష్ర్టాలకు సంబంధించి వైద్యారోగ్య రంగం సమగ్ర పనితీరులో (ఓవరాల్ పర్ఫార్మెన్స్) 2015-16లో తెలంగాణ 11వ స్థానంలో ఉండేది. 2019-20 నాటికి మూడో స్థానానికి చేరుకున్నది. తర్వాత నీతి ఆయోగ్ విడుదల చేస్తున్న హెల్త్ ఇండెక్స్లోనూ రాష్ట్రం మెరుగైన ర్యాంకును సాధిస్తూ.. గతేడాది మూడో ర్యాంకుకు చేరుకున్నది. క్షేత్రస్థాయి నుంచి సూపర్ స్పెషాలిటీ వరకు బలమైన దవాఖాన నెట్ వర్క్ ఉండటంతో ప్రజలకు సేవలు నిరంతరం అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది.
రాష్ట్రంలోని దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగిందని నివేదిక వెల్లడించింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్తు (టీవీవీపీ) పరిధిలోని దవాఖానల్లో 2020-21, 2021-22 మధ్య పెరిగిన సేవలను ఇం దుకు ఉదాహరణగా చూపింది. రాష్ట్రవ్యాప్తంగా టీవీవీపీ దవాఖానల్లో 2020-21లో 77 లక్షల మంది ఔట్ పేషెంట్లు నమోదు కాగా, మరుసటి సంవత్సరంలో ఏకంగా కోటికి పైగా సేవలు పొందినట్టు తెలిపింది. ఐపీ, మేజర్ సర్జరీలు, స్టెరిలైజేషన్, టెస్టులు ఇలా అన్ని అంశాల్లోనూ గణనీయమైన మార్పు కనిపించిందని చెప్పింది. అన్ని దవాఖానల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు స్పష్టం చేసింది.
టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా ల్యాబ్ టెస్టులను ఉచితంగా చేస్తుండటంతో ప్రభుత్వ దవాఖానలకు వచ్చే రోగులకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు కావడం లేదని నివేదిక తెలిపింది. 2018లో డయాగ్నోస్టిక్స్ సేవలు ప్రారంభం కాగా, 2021 నుంచి అనూహ్యంగా టెస్టులు, లబ్ధిదారుల సంఖ్య పెరిగినట్టు వెల్లడించింది. 2022లో ఏకంగా కోటి టెస్టులు నిర్వహించి రికార్డు సృష్టించినట్టు పేర్కొన్నది. లబ్ధిదారుల సంఖ్య కూడా 25 లక్షల మైలురాయిని దాటినట్టు వెల్లడించింది.
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఆరోగ్యశ్రీ కీలకపాత్ర పోషిస్తున్నట్టు నివేదిక వెల్లడించింది. సాధారణ సేవలకు రూ.5 లక్షలు, అవయవ మార్పిడి, క్యాన్సర్ చికిత్సలకు రూ.10 లక్షల కవరేజీ ఇస్తున్నట్టు పేర్కొన్నది. 2014-15 నుంచి 2022-23 (డిసెంబర్) వరకు ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.4,925.90 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించింది.