MLC Elections | హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నిర్వహించనున్న ఉప ఎన్నికల ప్రక్రియపై అయోమయం నెలకొన్నది. ఎన్నికల కమిషన్ గురువారం ప్రకటించిన షెడ్యూల్లో రెండు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు, వేర్వేరుగా బ్యాలెట్ పత్రాలు ఉంటాయని పేర్కొనడమే ఇందుకు కారణం. దీనిపై స్పష్టత కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల అధికారులు లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి శుక్రవారం రాత్రి లేక శనివారం స్పష్టత వచ్చే అవకాశం ఉన్నదని అధికారులు ‘నమస్తే తెలంగాణ’ప్రతినిధికి తెలిపారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్రెడ్డి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదలచేసింది. ఆ రెండు స్థానాలు ఎమ్మెల్యేల కోటాకు సంబంధించినవి కావడంతో తాజాగా నిర్వహించనున్న ఉప ఎన్నికలు కూడా ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం జరుగుతాయని భావించారు.
సాధారణంగా ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి 40 మంది ఎమ్మెల్యేల బలం ఉంటే సరిపోతుందని భావించారు. అధికార కాంగ్రెస్ పార్టీకి రెండు స్థానాలను గెలుచుకునేందుకు సరిపడా (80 మంది) ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేకపోవడంతో ఒక సభ్యుడిని, 39 మంది ఎమ్మెల్యేలున్న బీఆర్ఎస్ తనకు మిత్రపక్షమైన ఎంఐఎం మద్దతుతో మరో సభ్యుడిని గెలుచుకుంటుందనే అంచనాలున్నాయి. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్లో ఇద్దరు సభ్యులకు వేర్వేరుగా పోటీ, వేర్వేరుగా బ్యాలెట్ పత్రాలు (పింక్, వైట్) ఉంటాయని పేర్కొనడంతో రాజకీయపక్షాలు, అధికారుల అంచనాలు తల్లకిందులయ్యాయి.
ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే ఉప ఎన్నికలు జరిగే పక్షంలో సభలోని ఎమ్మెల్యేలు రెండేసి ఓట్లు వేయాల్సి ఉంటుంది. అప్పుడు సభలో మెజార్టీ కలిగిన అధికార పక్షానికే రెండు ఎమ్మెల్సీ స్థానాలు దక్కే అవకాశం ఉంటుంది. ఈ విధంగా గతంలో కౌన్సిల్ ఎన్నికలు జరిగిన అనుభవం రాజకీయ పక్షాలకు లేకపోవడంతో స్పష్టత కోసం వారు సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదిస్తున్నారు. ఈ విషయంలో తమకు కూడా కొంత అయోమయం ఉండటంతో రాష్ట్ర అధికారులు కేంద్ర ఎన్నికల కమిషన్ను వివరణ కోరినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.