హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్నివిధాలా సహకరించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికార బృందం విజ్ఞప్తి చేసింది. ఈసీఐ ఆదేశాల మేరకు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్రశర్మ, నితీశ్కుమార్ వ్యాస్ నేతృత్వంలోని అధికార బృందం శనివారం బుద్ధభవన్లో తెలంగాణ సీఎస్ శాంతికుమారితోపాటు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు చెందిన సీనియర్ అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు, పలు ఇతర విభాగాల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమై, అనేక అంశాలపై చర్చించింది.
ఎన్నికల్లో డబ్బు వినియోగాన్ని తగ్గించాలని, 2023కి సంబంధించి 2వ ఎస్ఎస్ఆర్ పురోగతిని అంచనా వేయాలని స్పష్టం చేసింది. సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ.. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని విధాలా తోడ్పాటు అందిస్తామని ఈసీఐ బృందానికి హామీ ఇచ్చారు. సమావేశంలో ఈసీఐ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఆరే గుప్తా, అండర్ సెక్రటరీ సంజయ్కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.