హైదరాబాద్, మే30 (నమస్తే తెలంగాణ): ఓటరు జాబితాను పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా సిద్ధం చేయాలని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో)లను ఎలక్షన్ కమిషన్ సీఈవో వికాస్రాజ్ ఆదేశించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈఆర్వోలకు స్పెషల్ సమ్మరీ రివిజన్, ఈఆర్వోనెట్ 2.0 సాంకేతిక అంశాలపై బుద్ధభవన్లో మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించి ఎలక్టోరల్ రోల్స్ నవీకరణపై అవగాహన కల్పించారు. ఓటరు జాబితా ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ రోల్ ఆగస్టు 2న ప్రచురితమవుతుందని, తుది జాబితా అక్టోబర్ 4న విడుదలవుతుందని తెలిపారు.
అక్టోబర్ 1 నాటికి ఓటు హక్కుకు అర్హులైన పౌరులందరూ https://voter.eci.gov.in/ మొబైల్ అప్లికేషన్ ఓటర్ హెల్ప్లైన్ యాప్ని ఉపయోగించి కానీ, ఆఫ్లైన్లో కానీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ప్రీ రివిజన్ కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఫారమ్-6, మల్టిపుల్ ఎంట్రీలు, మృతి చెందిన ఓటర్ల పేర్లు, శాశ్వతంగా మారిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించాలని, అర్హులందరికీ ఓటు హక్కు వచ్చిందో, లేదో నిర్ధారించుకోవాలని సూచించారు. వేర్వేరు కుటుంబాలు ఒకే ఇంటి నంబర్ ఉన్న భవనంలో నివసిస్తుంటే ప్రత్యేక పోర్షన్గా గుర్తించవచ్చని సూచించారు. ఈఆర్వోలు ప్రతివారం రాజకీయ పార్టీల సమావేశాలను నిర్వహించి, క్లెయిమ్లు, అభ్యంతరాల జాబితాను సరైన రసీదు కింద అందజేయాలని నొక్కిచెప్పారు. పోలింగ్ స్టేషన్ల వారీగా చేర్పులు, తొలగింపుల వివరాలను వెబ్ సైట్లో ఉంచినట్టు తెలిపారు.