హుజూరాబాద్/టౌన్, జూన్ 26: బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ వెన్నుపోటు రాజేందర్గా చరిత్రలో నిలిచిపోయాడని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో నిర్వహించిన టీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వామపక్ష భావజాలం, అంబేద్కర్ భావజాలం ఇష్టమని చెప్పుకునే ఈటల వాటికి విరుద్ధ సిద్ధాంతాలున్న బీజేపీలో ఎందుకు చేరాడో అందరికీ తెలుసన్నారు. స్వీయ రాజకీయ అస్థిత్వమే శ్రీరామరక్ష అన్న ప్రొఫెసర్ జయశంకర్ మాటలను సీఎం కేసీఆర్ అక్షరాలా నిజం చేస్తూ రాష్ర్టానికి అండగా నిలిచారని కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించిన ఈటల.. కేవలం అందివచ్చిన పదవులను అడ్డుపెట్టుకొని ఆస్తులు, అంతస్తులు కూడబెట్టుకొని విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్కు ఈటల రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఆయన నిజస్వరూపం బయటపడిందని పేర్కొన్నారు. ఆ లేఖ అబద్ధమని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి అమ్మవారి మీద ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.
బీజేపీ నాయకులు తనను కట్టు బానిస అని వ్యాఖ్యానిస్తున్నారని.. తాను తెలంగాణ ప్రజలకు కట్టు బానిసనని బాల్క సుమన్ పేర్కొన్నారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటానని, చచ్చేవరకు సీఎం కేసీఆర్ వెంటే ఉంటానని స్పష్టంచేశారు. ఈటల మాదిరిగా తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకం కాదన్నారు. వచ్చే ఉ పఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం సోషల్ మీడియా వారియర్స్ ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు హుజూరాబాద్లోని అంబేదర్ విగ్రహానికి టీఆర్ఎస్ నాయకులతో కలిసి బాల్క సుమన్ క్షీరాభిషేకం చేశారు. ఈ సమావేశంలో నాయకులు వకుళాభరణం కృష్ణమోహన్రావు, గెల్లు శ్రీనివాస్, బండ శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.