మెదక్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో ఈస్టర్ వేడుకలు (Easter Celebrations) కనుల పండువగా జరిగాయి. గుడ్ ఫ్రైడే రోజు శిలువపై అవుసులు బాసిన యేసు ప్రభువు మూడో రోజున సమాధి నుంచి భక్తులకు దర్శనమిస్తాడు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏసు పునరుత్థానమును గుర్తుచేసుకుంటూ పాటలు పాడారు. ఈస్టర్ వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావటం వల్ల చర్చి ప్రాంగణంలో కోలాహలం నెలకొంది. మెదక్ డయాసిస్ పరిధిలోని జిల్లాల నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి, ఆంధ్రా, కర్ణాటక రాష్ర్టాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరావడంతో చర్చి ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ప్రెస్ బిటరి ఇంచార్జి రెవరెండ్ శాంతయ్య భక్తులకు దైవ సందేశం అందించారు.
ఉదయం 4 గంటలకు సిలువ ఊరేగింపుతో ఈస్టర్ వేడుకలు చర్చి ప్రాంగణంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈస్టర్ పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సిలువకు మహిళలు పెద్దఎత్తున కొవ్వొత్తులు వెలిగించి స్మరించుకున్నారు. ఆరాధన దైవం, ప్రత్యేక ప్రార్థనలతో చర్చి ప్రాంగణం హోరెత్తింది. చర్చి గురువుల భక్తి సూక్తుల మధ్య భక్తి గీతాలు ఆలపించారు. యేసు సమాధి నుంచి లేచి వచ్చిన సందేశాలతో భక్తులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. కొంతమంది క్రైస్తవులు తమ ఆప్తుల సమాధుల వద్ద కొవ్వొత్తులు వెలిగించి స్మరించుకున్నారు.