హైదరాబాద్: టీఎస్ ఎంసెట్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంజినీరింగ్లో 80.41 శాతం మంది ఉత్తీర్ణులవగా, అగ్రికల్చర్లో 88.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో హైదరాబాద్కు చెందిన పోలు లోహిత్రెడ్డి మొదటి ర్యాంకు సాధించగా, ఏపీలోని శ్రీకాకులం జిల్లాకు చెందిన నక్కా సాయి దీప్తిక రెండో ర్యాంకు, పొలిశెట్టి కార్తికేయ, పల్లి జయలక్ష్మి, ఎం. హిమ వంశి తర్వాతి ర్యాంకుల్లో నిలిచారు. ఇక అగ్రికల్చర్ స్ట్రీమ్లో జుతూరి నేహ మొదటి ర్యాంకు సాధించగా, వీ. రోహిత్ రెండో ర్యాంకు, కే. తరూణ్ కుమార్ రెడ్డి, కే.మహీత్ అంజన్, జీ.శ్రీరామ్ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలను జులై 18 నుంచి 21 వరకు నిర్వహించారు. మొత్తం 1,72,243 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. పరీక్షకు 1,56,860 మంది హాజరయ్యారు. వీరిలో 1,26,140 మంది ఉత్తీర్ణత (80.41 శాతం) సాధించారు. అదేవిధంగా అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్కు 94,476 మంది దరఖాస్తు చేసుకోగా, 80,575 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 71,180 మంది (88.34 శాతం) అర్హత సాధించారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. పరీక్షల్లో విజయం సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోని ఎంసెట్ నిర్వహించామని చెప్పారు. పరీక్షలకు సహకరించిన అన్ని శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించామన్నారు. త్వరలోనే కౌన్సిలింగ్ ప్రారంభిస్తామని వెల్లడించారు. కోర్సుల ఎంపికలో విద్యార్థులు అయోమయానికి గురవకుండా ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ కాలేజీలు, కోర్సుల వివరాలు అందిస్తామని చెప్పారు.