హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : ఎంసెట్ రాసే విద్యార్థులకు మొదటి ప్రాధాన్యతగా ఎంపిక చేసుకొన్న చోటే పరీక్షాకేంద్రాలను కేటాయించనున్నట్టు అధికారులు తెలిపారు. సామర్థ్యం లేనిచోట మాత్రమే రెండో ప్రాధాన్యతగా ఎంచుకొన్న పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇక చివరి నిమిషంలో దరఖాస్తు చేసుకొన్న వారు తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కడ కేటాయిస్తే అక్కడే పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. ఆదివారం నుంచి ఎంసెట్ హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎంసెట్ కన్వీనర్ డీన్కుమార్, కో కన్వీనర్ విజయ్కుమార్రెడ్డి శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. మే 10 నుంచి 14 వరకు నిర్వహించే ఎంసెట్కు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. భారీగా దరఖాస్తుల వెల్లువతో ఈ ఏడాది పరీక్షాకేంద్రాలను పెంచినట్టు తెలిపారు. నిరుడు అగ్రికల్చర్కు 86, ఇంజినీరింగ్కు 108 పరీక్షాకేంద్రాలుండగా, ఈసారి అగ్రికల్చర్కు 113, ఇంజినీరింగ్కు 135 వరకు పరీక్షాకేంద్రాలను కేటాయించినట్టు వివరించారు. ఒక్కో సెషన్కు తెలంగాణలో 26,800, ఏపీలో 6వేల మంది చొప్పున విద్యార్థులు ఎంసెట్కు హాజరవుతారని పేర్కొన్నారు.
రాష్ట్రం నుంచి మొత్తం 2,48 146 దరఖాస్తులు రాగా, వీటిలో అత్యధికంగా 1,71,303 (60%) దరఖాస్తులు హైదరాబాద్ నుంచే వచ్చాయి. రెసిడెన్షియల్ కాలేజీల్లోని విద్యార్థులంతా హైదరాబాద్లోనే ఎంసెట్ కోచింగ్ తీసుకొంటుండగా, వీరంతా ఇక్కడి పరీక్షాకేంద్రాలను ఎంపిక చేసుకొన్నారు. ఫలితంగా హైదరాబాద్ నుంచి పరీక్ష రాసే వారి సంఖ్య పెరిగింది.
నిరుడు ఎంసెట్లో అగ్రికల్చర్, మెడికల్ విభాగానికి 94 వేల దరఖాస్తులే రాగా, ఈసారి 1.15 లక్షల దరఖాస్తులొచ్చాయి. ఈ విభాగానికి ఈ సారి బీఎస్సీ నర్సింగ్ను కూడా చేర్చడంతో దరఖాస్తుల సంఖ్య పెరిగింది.
ఎంసెట్ పరీక్షలు ముగిసిన రెండు వారాల్లో ఫలితాలను ప్రకటిస్తారు. ఎంసెట్లో ఇంటర్ వెయిటేజీ లేకపోవడంతో ఇంటర్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ ఫలితాల కోసం వేచిచూడాల్సిన అవసరం లేదు. విద్యార్థుల ఎంసెట్ మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తారు. పరీక్ష ముగిసిన రెండు రోజుల్లో ప్రాథమిక ‘కీ ’ని, రెస్పాన్స్షీట్లను విడుదల చేసి 72 గంటల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆ వెంటనే తుది ‘కీ’ని వెల్లడించి, ఫలితాల ప్రక్రియను ప్రారంభిస్తారు.