తెలుగు యూనివర్సిటీ, మార్చి 7: తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వ పూర్వసలహాదారుడు, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ రమణాచారి విజ్ఞప్తిచేశారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా బ్రాహ్మణుల సంక్షేమానికి మాజీ సీఎం కేసీఆర్ పాటుపడగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణుల సంక్షేమం పూర్తిగా అటకెక్కిందని పేర్కొన్నారు. రెడ్హిల్స్లో తన క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. గతంలో బ్రాహ్మణుల బాధలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే సంక్షేమ పరిషత్తును ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. తనను అధ్యక్షుడిగా నియమించి, ప్రభుత్వానికి ఆర్థిక భారమైనా సాహసోపేతమైన నిర్ణయంతో బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేశారని తెలిపారు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తూట్లు పొడుస్తున్నదని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి అధికారం చేపట్టి రెండేండ్లు గడుస్తున్నా ఇప్పటివరకు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఉన్నదనే విషయం మరిచిపోవడం బాధాకరమని తెలిపారు. ఈ పథకం గురించి సీఎం రేవంత్రెడ్డి, ఇతర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. పథకంపై ఇంకా ఎంతకాలం ఈ నిర్వీర్యత అని ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టిసారించి ఉగాది సందర్భంగానైనా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని కోరారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు కార్యకలాపాలను కొనసాగించాలని రమణాచారి ప్రభుత్వానికి విన్నవించారు.