హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తుంది అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎంబీసీల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఇ-ఆటో రిక్షా పథకంలో భాగంగా 60 శాతం సబ్సిడీతో 12 మంది లబ్దిదారులకు సంక్షేమ భవన్లో ఆటోలను అందించారు. 12 ఆటోలకు రూ. 23,24,952లు వెచ్చించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… గత ప్రభుత్వాలు ఎంబీసీలను పట్టించుకోలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని బీసీ, ఎంబీసీలు ఉన్నత వర్గాలకు దీటుగా చదువుకోవాలి, ఎదగాలి, పదవులు అలంకరించాలని లక్ష్యంగా పెట్టుకొని కృషి చేస్తున్నారని తెలిపారు. సమాజంలో దాదాపు 60శాతం ఉన్న బీసీల అభివృద్ది కోసం విద్యను అందించాలనే సంకల్పంతో 281 గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని పేర్కొన్నారు.
రూ. 500కోట్ల విలువ చేసే పదెకరాల భూమిని ఎంబీసీలకు కేటాయించామన్నారు. ఇ-ఆటోల యూనిట్కు రూ. 3,22,910 ఉందని, వీటిలో ప్రభుత్వం సబ్సిడీ కింద రూ. 1,93,746లను అందించిందని గుర్తు చేశారు. లబ్దీదారుల వాటాగా రూ.15,000, బ్యాంకు రుణం కింద రూ. 1,14,164 ఉందన్నారు. ఈ ఆటోల కోసం దాదాపు 500 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇందులో 36 మందికి ఆటోలు అందించేందుకు ఏర్పాట్లు చేశామని, 12 మందికి ఇవాళ అందించామన్నారు. మిగతా వారికి త్వరలోనే ఇ-ఆటోలను అందిస్తామని గంగుల కమలాకర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎంబీసీ కార్పోరేషన్ సీఈవో మల్లయ్య భట్టు, వడ్డెర ఫెడరేషన్ ఎండీ బాలాచారి, నాయీబ్రాహ్మణ ఫెడరేషన్ ఎండీ విమలాదేవి, ఎస్బీఐ ఏజీఎం శ్రీనాథ్, మహీంద్రా సంస్థ ప్రతినిధి నాగేశ్వర్ రావు, లబ్దీదారులతో పాటు ఎంబీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.