కరీంనగర్, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బతుకమ్మ, దసరా పండుగల వేళ మూడు రోజులపాటు కళోత్సవాల నిర్వహణకు కరీంనగర్ వేదిక అవుతున్నది. జాతీయ, అంతర్జాతీయ కళాకారులతో ప్రదర్శనలు ఇప్పించేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30 నుంచి అక్టోంబర్ 2 వరకు నిర్వహించనున్నారు. రోజూ సాయంత్రం 4 నుంచి రాత్రి 11 వరకు సాగే కార్యక్రమాలను ఒకేసారి 20 వేల మందికిపైగా వీక్షించేలా అంబేద్కర్ మైదానాన్ని తీర్చిదిద్దుతున్నారు. జిల్లా చరిత్ర వైభవాన్ని, తెలంగాణ సంస్కృతులు, జానపదాలు వంటి విభిన్న కళాకృతులను చాటి చెప్పడమే కాకుండా.. వివిధ రాష్ర్టాల్లోని సంప్రదాయ కళాప్రదర్శనలు, ఐదు దేశాల నుంచి కళాకారులను రప్పించి ప్రదర్శనలు ఇప్పించేందుకు మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానికులకు వినోదాన్ని పంచాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 30న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఉత్సవాలను ప్రారంభిస్తారు. అక్టోబర్ 1, 2వ తేదీల్లో జరిగే కళోత్సవాలకు సినీ నటులు ప్రకాశ్రాజ్, రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరవుతారు. ఈ కళోత్సవాల్లో కేవలం తెలంగాణ నుంచే కాకుండా దేశంలోని 28 రాష్ర్టాలు, విదేశాల నుంచి మొత్తం 150 కళా బృందాలు పాల్గొననున్నాయి. ఒక్కో బృందంలో 15 నుంచి 18 మంది కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.