హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు అల్పపీడన ప్రాంతంలోనే స్థిరంగా కొనసాగుతున్నది. అల్పపీడనం వాయవ్యదిశగా ఒడిశా తీరం వైపు కదులుతూ మంగళవారం సాయంత్రానికి మరింత బలపడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం తెలిపింది. వీటి ప్రభావంతో ఈ నెల 22వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.
మంగళవారం ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 242 మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసినట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. అత్యధికంగా మంచిర్యాల మండలం కాసిపేటలో 5.36 సెంటీ మీటర్లు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో 3.64, నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో 3.61 సెంటీ మీటర్ల వర్షం కురిసినట్టు వివరించింది.