కట్టంగూర్ (నకిరేకల్), ఫిబ్రవరి 6: రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం రాత్రి ఆయన తన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెల లబ్ధిదారులతో ముచ్చటించి అక్కడే పల్లె నిద్ర చేశారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ.. గొర్రెల పంపిణీ, సంపద పెంపులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. కుల వృత్తులకు చేయూతనందించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అందించిన గొర్రెలను పెంచుతూ గొల్ల కురుమలు ఆర్థికంగా బలోపేతమవుతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆదేశాలతో గొల్ల కురుమల సంక్షేమానికి, అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.