హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): అణగారిన వర్గాల బాలికలకు విద్యనందించే కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) అదనపు సౌకర్యాల కల్పనలో భాగంగా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని 435 కేజీబీవీలకు డ్యూయల్ డెస్క్ బల్లలను సమకూర్చాలని నిర్ణయించింది. రూ.91.86 కోట్లతో 65,500 డ్యూయల్ డెస్క్ బల్లలను కేజీబీవీలకు సరఫరా చేయనున్నది. కేజీబీవీల్లో హైస్కూల్ విద్యార్థులే ఉండటంతో టైప్-4, టైప్-3 రెండు రకాల డ్యూయల్ డెస్క్ బల్లలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నది.
ఒక్కో టైప్-3 బల్లకు రూ.14,095, ఒక్కో టైపు-4 బల్లకు రూ.13,999 చొప్పున ఖర్చు చేస్తున్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ఒప్పందం ప్రకారం ఈ ధరలను ఖరారు చేశారు. 2023-24 విద్యా సంవత్సరంలోని నాబార్డ్ నిధులతో ఈ బల్లలను ఏర్పాటు చేస్తున్నారు. ఎలిగెంట్ ఇంపెక్స్ మెథడాక్స్ (జేవీ) కంపెనీకి ఈ బల్లల సరఫరా బాధ్యతలను అప్పగించారు. మూడు నెలల వ్యవధిలో ఈ బల్లలను ఆయా బడులకు అందజేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు.