Medigadda Barrage | హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): లక్ష్మీబరాజ్ పునరుద్ధరణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ వెల్లడించారు. బరాజ్ నిర్మాణంలో ఎలాంటి నాణ్యత, డిజైన్ లోపాలు లేవని, ఇసుక కదలిక వల్లే బరాజ్లోని 7వ బ్లాక్ పియర్లు స్వల్పంగా కుంగాయని వివరించారు. ఈ ఘటనపై ఇరిగేషన్ ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. బరాజ్ కుంగుబాటుకు సంబంధించిన సాంకేతిక అంశాలపై చర్చించారు. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపైనా సమాలోచనలు జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పియర్ల కుంగుబాటుపై అధ్యయనానికి వచ్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందానికి సాంకేతిక వివరాలు అందజేసినట్టు చెప్పారు. తొలుత కాఫర్డ్యామ్ నిర్మాణం ప్రారంభించి, తర్వాత పియర్స్ వద్ద నీరు లేకుండాచేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని తెలిపారు. సమావేశంలో ఈఎన్సీ మురళీధర్, రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఓఅండ్ఎం ఈఎన్సీ నాగేందర్రావు, సీడీవో సీఈ మోహన్కుమార్, ఈఎన్సీ అనిల్, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండేతో పాటు ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.
డీఎస్ఆర్ ప్యానెల్ నేడు బరాజ్ సందర్శన
బరాజ్ కుంగుబాటుపై సాంకేతిక కారణాలను అధ్య యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డ్యా మ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ నేడు బరాజ్ను సందర్శించి సాంకేతిక అంశాలను పరిశీలిస్తుంది. మరోవైపు, అంతర్రాష్ట్ర జలవిభాగం అధికారులతో రజత్కుమార్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ట్రిబ్యునల్ విచారణకు సంబంధించి తదుపరి చేపట్టాల్సిన చర్యలపై వారితో సమాలోచనలు జరిపారు. సమావేశంలో అంతర్రాష్ట్ర జలవిభా గం సీఈ మోహన్కుమార్, ఎస్ఈ కోటేశ్వర్రావు, సల్లా విజయ్కుమార్, సుబ్రహ్మణ్యప్రసాద్ పాల్గొన్నారు.