DSC exams : డీఎస్సీ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డిఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవవచ్చని పేర్కొంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
కాగా, డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని గత కొన్ని రోజులుగా అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. టెట్ పరీక్ష నిర్వహించి ఆ వెంటనే డీఎస్సీ నిర్వహిస్తున్నారని, రెండు పరీక్షల సిలబస్ వేర్వేరు కాబట్టి డీఎస్సీ ప్రిపరేషన్కు సమయం కావాలని వారు కోరుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన కనిపించకపోవడంతో అభ్యర్థులు సోమవారం విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టిడించారు.
అయితే అభ్యర్థుల అందోళనను ప్రభుత్వం లెక్కచేయలేదు. డీఎస్సీ పరీక్షల వాయిదాకు అంగీకరించలేదు. యథాతథంగా ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించేందుకు మొగ్గుచూపింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. దాంతో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన అరణ్య రోదనే అయ్యింది.