హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): కొవిడ్ వైరస్ రోజుకో రకంగా రూపం మార్చుకుంటున్నట్టే, దాని వల్ల కలిగే సమస్యలు సైతం పెరుగుతున్నట్టు అధ్యయనాల్లో వెల్లడవుతున్నది. తాజాగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్)అధ్యయనంలో కొవిడ్-19 వైరస్ నాలుక రుచి జ్ఞానాన్ని అడ్డుకోవడంతోపాటు నోటిలో పొక్కులు, పొడిబారటం వంటి సమస్యలను సృష్టిస్తున్నట్టు తేలింది. ఇటీవలి కరోనా కేసుల్లో 60 శాతం మంది రుచి, వాసన కోల్పోయినట్టు తేలింది. ఈ నివేదిక సైంటిఫిక్ జర్నల్ ‘నేచర్ మెడిసిన్’లో ప్రచురితమైంది. దీని ప్రకారం కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత చాలామందిలో నోటి ఇన్ఫెక్షన్లు కనిపిస్తున్నాయి. వైరస్ నేరుగా నోటి కణజాలంపై దాడి చేస్తున్నదనడానికి మాత్రం ఆధారాలు లేవు. శ్వాసించినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు వైరస్ ఊపిరితిత్తులు, గొంతు నుంచి నోటిలోకి వస్తున్నదని, దీంతో నోటి కుహరం, ఇతర కణజాలాలకు సోకుతున్నదని పరిశోధకులు పేర్కొన్నారు. అసిమ్టమాటిక్, తక్కువ లక్షణాలు ఉన్న కేసుల్లోనూ నోటి ఇన్ఫెక్షన్లు కనిపిస్తున్నాయని ఎన్ఐహెచ్ పేర్కొన్నది. దీనిపై లోతుగా అధ్యయనం జరుగాల్సి ఉన్నదన్నారు.
కరోనా వైరస్ వల్ల నోటి సమస్యలు వస్తాయని ప్రస్తుతానికి కచ్చితంగా నిర్ధారించే ఆధారాలు లేవు. చాలామంది రోగుల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అసిమ్టమాటిక్ రోగుల్లో పైన పేర్కొన్న లక్షణాల్లో ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. నిర్లక్ష్యం వహిస్తే మాట్లాడటం, శ్వాస తీసుకోవడం ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు.
నోరు పొడిబారడం లేదా లాలాజలం ఉత్పత్తి తగ్గిపోవడం. లాలాజలం నోటిని తడిగా ఉంచడంతోపాటు ఆహారాన్ని అరిగించే జీర్ణరసంగా, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల నుంచి రక్షణ కవచంగా పనిచేస్తుంది. డ్రై మౌత్ సిండ్రోమ్ సమయంలో లాలాజలం ఉత్పత్తి తగ్గడం, లేదా లాలాజలం చిక్కబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో నోరు పొడిబారుతుంది. పెదాలు, నోటి కుహరంలోని పైపొర పగిలి మంటగా అనిపిస్తుంది. కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. మాట్లాడినప్పుడు, తిన్నప్పుడు నోరు మండుతుంది. కొవిడ్ సోకినవారిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని ఎన్ఐహెచ్ పేర్కొంది.
కొవిడ్ వైరస్ నోటి కండరాలపై దాడి చేసినప్పుడు దాని ప్రభావం వల్ల కొందరిలో నాలుకపై, నోటిలో అక్కడక్కడ, పెదాల వెనుక పొక్కులు ఏర్పడుతున్నాయి. దీంతో నొప్పి, మంటతోపాటు ఆహారం తీసుకోవడం ఇబ్బంది అవుతున్నది.
కరోనా సోకినవారిలో చాలా ఎక్కువగా కనిపిస్తున్న లక్షణం ఇది. బాధితుల్లో నాలుక పై పొర చాలా సున్నితంగా మారుతున్నది. దీంతో నీళ్లు తాగినా, ఆహారం తీసుకున్నా మండుతున్నది. కరోనా వల్ల కలిగే చర్మ సమస్యల్లో ఇది ఒకటని పలువురు వైద్యులు చెప్తున్నారు.
కరోనా నాలుక కండరాలు, చర్మంపై ప్రభావం చూపడం వల్ల నాలుక రంగు మారిపోతున్నది. సాధారణంగా గులాబీ రంగులో ఉండే నాలుక ఎర్రగా లేదా తెల్ల మచ్చలుగా, కొన్నిసార్లు ముదురు రంగులోకి మారుతుంది. దీంతోపాటు అంచుల్లో పొక్కులు ఏర్పడటం, కండరాల్లో వాపు వస్తున్నది.