రామగిరి, ఫిబ్రవరి 07: మద్యంమత్తులో ఆర్టీసీ మహిళా కండక్టర్తో (RTC Conductor) అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులు కేసుల పాలయ్యారు. కరీంనగర్ నుంచి మంథని వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గురువారం రాత్రి 9 గంటలకు తెలంగాణ చౌరస్తా, సెంటినరి కాలనీకి చేరుకున్నది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు కారును ర్యాష్గా నడుపుకుంటూ వచ్చి బస్సుకు అడ్డంగా పెట్టారు. కారును పక్కకు తీయాలని బస్సు డ్రైవర్ అడగడంతో అతనితో వాగ్వాదానికి దిగారు. అడ్డుగా వెళ్లిన కండక్టర్పై దురుసుగా ప్రవర్తించి దౌర్జన్యానికి దిగారు. అసభ్య పదజాలంతో మాటలు తూలారు. దీంతో స్థానికులు వారిని అడ్డుకున్నారు.
కాగా, ఆర్టీసీ మహిళా కండక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. నిందితులు కమాన్పూర్ మండలం గుండారం గ్రామనికి చెందిన రాచకొండ రవి, మోతె రాజయ్యలపై కేసు ఫైల్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ చంద్రకుమార్ మాట్లాడుతూ ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.