హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతూ అన్ని రంగాల్లో వేగంగా పురోగమిస్తున్న తెలంగాణకు మత్తు మరక అంటించేందుకు విపక్ష నేతలు కుట్ర పన్నుతున్నారు. హైదరాబాద్లో డ్రగ్స్ దందా పెరిగిందని కరీంనగర్ ఎంపీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల తమ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆరోపించడం ఈ కుట్రలో భాగమే. అసలు రాష్ట్రంలోకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయన్న దానిపై సంజయ్ నోరు మెదపకపోవడం, ఇతర దేశాల నుంచి భారత్లోకి వస్తున్న మాదకద్రవ్యాలను దేశ సరిహద్దుల్లోనే అడ్డుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను విస్మరించి అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం బీజేపీ దుర్నీతిని బట్టబయలు చేస్తున్నది. వాస్తవానికి మన దేశంలోకి ఎక్కువగా పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, ఇరాన్ నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. సరి‘హద్దు’లు దాటి వందల కిలోలు దేశంలోకి వస్తున్నాయి. వాటికి ఆదిలోనే అడ్డుకట్ట వేయాల్సిన సరిహద్దు రాష్ర్టాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు చోద్యం చూస్తున్నాయి.
యువతను జీవచ్ఛవాలుగా మారుస్తున్న డ్రగ్స్ రవాణాకు ఆయా రాష్ర్టాలు తమ సరిహద్దులను బార్లా తెరుస్తున్నాయి. డ్రగ్స్ స్మగ్లర్లకు గుజరాత్-పాకిస్థాన్ సరిహద్దులోని సముద్ర మార్గం ఎర్రతివాచీలా తయారైంది. ఇటీవల ఆ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల విలువైన మాదకద్రవ్యాలు పట్టుబడటమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. గత ఏడాది సెప్టెంబర్లో గుజరాత్లోని ముంద్రా పోర్ట్లో ఎన్ఐఏ అధికారులు ఒకేసారి ఏకంగా రూ.21,000 కోట్ల విలువైన 2,998 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దేశ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే తొలిసారి. గుజరాత్తోపాటు ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాలు సైతం డ్రగ్స్ రవాణాకు ప్రధాన మార్గాలుగా మారాయి. ఈ నిజాలన్నింటినీ తొక్కిపెట్టి హైదరాబాద్లో డ్రగ్స్ దందా పెరుగుతున్నదని రాష్ట్ర బీజేపీ నాయకులు అర్థంలేని వాదనలు చేస్తుండటం గమనార్హం.
ముకుతాడు ఎందుకు వేయలేకపోతున్నారు?
దేశంలోకి సులభంగా డ్రగ్స్ను తరలించేందుకు స్మగ్లర్లు గుజరాత్ తీరాన్ని ఎంచుకోవడాన్ని బట్టి ఆ రాష్ట్రంలోని పోలీసులు, కేంద్ర నిఘా వ్యవస్థలు, డీఆర్ఐ, ఎస్సీబీ లాంటి సంస్థలు ఎంత ‘గొప్ప’గా పనిచేస్తున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. గుజరాత్లోనూ, కేంద్రంలోనూ బీజేపీయే అధికారంలో ఉండటం, ఆ పార్టీ పెద్దల దోస్తుల్లో ఎక్కువ మంది గుజరాతీయులే కావడంతో అధికారులు డ్రగ్స్ దందా ను చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు నానాటికీ బలపడుతున్నాయి. మరోవైపు స్వ యంగా గుజరాత్లోనే గంజాయి సాగు విపరీతంగా పెరిగినట్టు స్పష్టమవుతున్నది. ఆ రాష్ట్రంలోని ఆనంద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల జొన్న చేలలో సాగుచేస్తున్న 900 కిలోల గంజాయిని ఇటీవల పోలీసులు స్వాధీనం చేసుకోవడం ఇందుకు నిదర్శనం.
గుజరాత్లో 376.5 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
గుజరాత్లోని కుట్చు జిల్లా ముంద్రా పోర్టు వద్ద ఓ కంటైనర్ నుంచి 75.3 కిలోల హెరాయిన్ను మంగళవారం ఆ రాష్ట్ర యాంటీ టెర్రరిస్టు స్కాడ్ (ఏటీఎస్) అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ హెరాయిన్ విలువ సుమారు రూ.376.5 కోట్లు ఉంటున్నదని తెలిపారు. గుజరాత్ డీజీపీ అశీశ్ భాటియా వివరాల ప్రకారం.. రెండున్నర నెలల కిత్రం ముంద్రా పోర్టుకు వచ్చిన కంటైనర్లో మాదకద్రవ్యాలు ఉన్నాయని పక్కా సమాచారంతో గుజరాత్ ఏటీఎస్ అధికారులకు ఈ విషయాన్ని తెలిపామన్నారు. తర్వాత ఏటీఎస్ బృందం, స్థానిక పోలీసులు కలిసి పోర్టు వద్ద అనుమానిత కంటైనర్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారన్నారు. అందులో 540 ప్యాబ్రిక్ రోళ్లలో ఉంచిన 64 హెరాయిన్ పౌడర్ ప్యాకెట్లను గుర్తించారని వెల్లడించారు. యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యుఏఈ)లోని అజ్మన్ ఫ్రీ జోన్ నుంచి ఈ ఏడాది మే 13న పోర్టుకు కంటైనర్ వచ్చిందని పేర్కొన్నారు. అయితే.. ఈ ఘటనలో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని డీజీపీ తెలిపారు.