హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ): అచ్చం సింగం-2 సినిమాను తలపించే కేసు ఇది. విదేశాల నుంచి భారత్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న విలన్ డానీని హీరో పట్టుకొన్న కథ లాంటిదే. నిజజీవితంలో విలన్ పేరు.. టోనీ, పట్టుకొన్నది.. ముంబైలో, ఆ సాహసం చేసింది.. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు. నైజీరియా నుంచి ముంబైకి మాదక ద్రవ్యాలను అక్రమంగా దిగుమతి చేస్తున్న టోనిని మన పోలీసులు ముంబైలో అరెస్టు చేసి, గల్లా పట్టి గుంజుకొచ్చి కటకటాల్లోకి నెట్టారు. నైజీరియాకు చెందిన చుక్వు ఓగోబొన్న డేవిడ్ అలియాస్ టోనీ 2013లో తాత్కాలిక వీసాపై ముంబైకి వచ్చాడు. మొదట్లో బట్టల వ్యాపారం చేసిన ఇతడు.. 2017లో నైజీరియాకు చెందిన లవీత్ యుసుఫ్ను పెండ్లి చేసుకొన్నాడు. వీళ్లకు ఒక పాప. వీసా గడువు పూర్తయినా టోనీ ఇక్కడే తిష్ట వేశాడు. నైజీరియా, ఆఫ్రికా దేశాలకు చెందినవాళ్లు ఎక్కువ సంఖ్యలో నివాసముండే వసాయి విరార్ ప్రాంతంలో ఉంటున్నాడు. అక్కడే డ్రగ్స్కు అలవాటు పడి, స్మగ్లర్గా మారాడు. దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటుచేసుకొని మెట్రోపాలిటన్ నగరాలను మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు ముంబైలోని అంధేరీకి చెందిన ఇమ్రాన్బాబు షేక్ను ఇన్చార్జిగా నియమించాడు. అతడు నూర్ మహ్మద్ ఖాన్ను సబ్ ఏజెంట్గా నియమించుకొన్నాడు. ఈ ముఠాను ఈ నెల 6న నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారంతో టోనీ కోసం నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు బృందం 10 రోజుల పాటు ముంబైలో మకాం వేశారు. తమ వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో టోనీ కదలికలపై నిఘాపెట్టారు. ఇమ్రాన్ బాబు షేక్ గ్యాంగ్ అరెస్టుతో అప్పటికే రెండు సార్లు తన అడ్రస్ మార్చిన టోనీ.. ముంబై, పుణెకు రాకపోకలు సాగిస్తుండగా పోలీసులు పట్టుకొన్నారు. అతడి వద్ద 10 గ్రాముల కొకైన్, ఒక కారును స్వాధీనం చేసుకొని హైదరాబాద్కు తరలించారు. కేసును దర్యాప్తు చేస్తున్న పంజాగుట్ట పోలీసులు టోనీని కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం 22 మందిని నిందితులుగా చేర్చారు.
టోనీకి బయట ప్రపంచంతో సంబంధం లేదు. కేవలం వీఓఐపీ(వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్), నైజీరియా ఫోన్ నంబర్తో వాట్సాప్ కాల్స్ చేస్తూ తన నెట్వర్క్తో సంప్రదింపులు సాగిస్తుంటాడు. ఇతడికి ఆఫ్రికాకు చెందిన అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ ‘స్టార్ భాయ్’ ఓడల ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు వెల్లడయ్యింది. టోనీకి ఇమ్రాన్ బాబు షేక్, నూర్ మహ్మద్ ఖాన్, అఫ్తాబ్, ఫర్వాజ్, రహమంత్, ఇర్ఫాన్, ఫిర్దోస్ ఏజెంట్లుగా వివిధ రాష్ర్టాల్లో పనిచేస్తున్నారు. టోనీకి హైదరాబాద్లో 15 నుంచి 20 మంది వరకు కస్టమర్లు ఉన్నట్టు విచారణలో తేలింది. అందులో కొందరిని పోలీసులు అరెస్ట్ చేసి, మిగతావారి కోసం గాలిస్తున్నారు.
ఈ నెల 6న డ్రగ్స్ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్లకే పరిమితం కాకుండా, ప్రధాన డ్రగ్ సరఫరాదారుడి కోసం ఎక్కడికైనా, ఎంత దూరమైన వెళ్తాం.. హైదరాబాద్లో డ్రగ్స్ సరఫరాను తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకొంటామని సీపీ సీవీ ఆనంద్ గతంలో తెలిపారు. అన్నట్టుగానే డ్రగ్స్ ముఠాలోని కీలక నిందితుడిని పట్టుకొని నెట్వర్క్ను ధ్వంసం చేశారు. డ్రగ్స్ వినియోగదారులను అరెస్ట్ చేసి డిమాండ్ చైన్ను తెంపేశారు. అలాగే, నైజీరియన్ రాయబార కార్యాలయం సహకారంతో అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ ‘స్టార్ భాయ్’ను కూడా పట్టుకొనే ప్రయత్నం చేస్తామని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. డ్రగ్స్ మూలాలను పెకిలిస్తామని స్పష్టం చేశారు.
టోనీ గ్యాంగ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వారిని పోలీసులు గుర్తించారు. అందులో వెయ్యి కోట్ల వ్యాపారం నిర్వహించే హిమాయత్నగర్కు చెందిన కాంట్రాక్టర్ నిరంజన్కుమార్ జైన్ ఉన్నాడు. అతడు 30 సార్లు టోనీని సంప్రదించి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు తేలడంతో అరెస్ట్ చేశారు. రూ.200 కోట్ల వ్యాపారాలు నిర్వహించే బంజారాహిల్స్కు చెందిన బిల్డర్ శాశవత్ జైన్, గౌలిపురాకు చెందిన మసాలా వ్యాపారి యాగ్యానంద్ అగర్వాల్, బంజారాహిల్స్కు చెందిన మందు సూర్యసుమంత్రెడ్డి, ఎర్రగడ్డకు చెందిన బండి భార్గవ్, జూబ్లీహిల్స్కు చెందిన వెంకట్ చలసాని, బంజారాహిల్స్కు చెందిన తమ్మినేడి సాగర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరంజన్, వెంకట్ చలసాని తమ ఆఫీస్బాయ్స్ ఫోన్ నుంచే ఆర్డర్లు ఇచ్చినట్టు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఇద్దరు ఆఫీస్ బాయ్స్ను కూడా అదుపులోకి తీసుకొన్నారు.