హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): పీజీ వైద్య విద్యార్థులు తప్పనిసరిగా ‘డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాం’ (డీఆర్పీ) పూర్తి చేయాల్సిందేనని నేషనల్ మెడికల్ కమిషన్ గురువారం ఆదేశాలు జారీ చేసింది. నెలలు జిల్లా దవాఖానల్లో విధులు నిర్వర్తించాలని సూచించింది. దీనిని 2,4,5వ సెమిస్టర్లలో అమలు చేయాలని తెలిపింది. డీఆర్పీని 2020 నుంచే అమలు చేయాలని ఎన్ఎంసీ భావించింది. కొవిడ్ కారణంగా అమలు కాలేదు. డీఆర్పీ నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని 2020 బ్యాచ్ విద్యార్థులు వేడుకొన్నారు. దీంతో వారికి మినహాయింపు ఇచ్చింది.
2021 బ్యాచ్ నుంచి డీఆర్పీని అమలు చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, డీమ్డ్ వర్సిటీల విద్యార్థులు తప్పనిసరిగా దీనిని పూర్తి చేయాల్సిందేనని చెప్పింది. కనీసం 100 పడకలు, ఆపై సామర్థ్యం ఉన్న దవాఖానలకే విద్యార్థులను కేటాయించాలని డీఎంఈలను ఆదేశించింది. విద్యార్థులకు వసతిని దవాఖాన ప్రాంగణంలో లేదా 2 నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేయాలని సూచించింది.