హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): వీలైనంత త్వరగా రైతులకు డ్రోన్లు అందజేయాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ కార్యదర్శి మనోజ్ అహుజా సూచించారు. శనివారం రాజేంద్రనగర్లోని వ్యవసాయ వర్సిటీని ఆయన సందర్శించారు. వర్సిటీలో వివిధ పంటల ప్రయోగాలను, పంటలపై డ్రోన్ల ద్వారా పురుగుమందు పిచికారీని పరిశీలించారు. అనంతరం అగ్రిహబ్లో వ్యవసాయ విధానాలు, కేంద్ర, రాష్ట్ర పథకాలపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన శ్రీజ పల్లీల పొట్టుతో పూల కుండీలను తయారు చేశారు. ఇందుకు వర్సిటీలోని అగ్రిహబ్ వేదికైంది. ఇటీవలే పదో తరగతి పూర్తి చేసుకున్న శ్రీజ.. స్టార్టప్లపై ఆసక్తి కనబరిచారు. ఆ పూలకుండీని మనోజ్ ఆహుజాకు అందించారు.