హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో ఇప్పటికీ ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేవని, ఈ నేపథ్యంలో తాగునీటికే తొలి ప్రా ధాన్యమివ్వాలని ఇరు రాష్ర్టాలకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సూచించింది. ఈ మేరకు తెలంగాణకు 6.04, ఏపీకి 26.29 టీఎంసీలు కేటాయిస్తున్నట్టు ఇరు రాష్ర్టాలకు లేఖలు రాసింది. ఈ ఏడాది సాగు, తాగునీటి విడుదల గురించి చర్చించేందుకు కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇటీవల త్రిసభ్య కమిటీ సమావేశం కొనసాగింది. కాగా, తాగునీటి అవసరాల కోసం వచ్చే ఏడాది మే నాటికి కల్వకుర్తికి 5.55 టీఎంసీలు, నాగర్జునసాగర్ నుంచి ఎమ్మార్పీతోపాటు హైదరాబాద్ తాగునీటికి 15.40 టీఎంసీలు, ఎడమ కాలువకు 6 టీఎంసీలు కలిపి మొత్తం 26.95 టీఎంసీలు కేటాయించడంతోపాటు సెప్టెంబర్ వరకు సాగునీటి అవసరాలకు శ్రీశైలం నుంచి 15.73 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి 23 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ ఇప్పటికే కేఆర్ఎంబీకి ఇండెంట్ను అందజేసింది. ఏపీ గతంలో సమర్పించిన ఇండెంట్ను సవరించి తాగు, సాగునీటి అవసరాలకు 30 టీఎంసీలు కావాలని కోరింది. దీంతో ఇరు రాష్ర్టాల ఇండెంట్లను కేఆర్ఎంబీ పరిశీలించి, పలు ప్రతిపాదనలు చేసిం ది. ఇప్పట్లో ఎగువ నుంచి నీటి ప్రవాహాలు వచ్చే అవకాశాలు లేవని తెలిపింది.