హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): అవసరాలకు తగ్గట్టుగా రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ధిని సాధించాలని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సతీశ్రెడ్డి అన్నారు. నగరంలోని కంచన్బాగ్లో డీఆర్డీవోకు చెందిన చెస్ (సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్స్)లో సోమవారం నిర్వహించిన తొమ్మిదో వార్షికోత్సవ కార్యక్రమానికి సతీశ్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రస్తుతం క్షేత్రస్థాయి అవసరాల దృష్ట్యా ఎనర్జీ సిస్టమ్స్, యాంటీ డ్రోన్ టెక్నాలజీ అత్యంత ముఖ్యమని తెలిపారు. మన యాంటీ డ్రోన్ సిస్టం పనితీరును మరింత మెరుగుపర్చుకోవాలని సూచించారు. అనారోగ్యం పాలైన చెస్ ఉద్యోగి గౌతంషాకు చికిత్స అందించిన కామినేని దవాఖాన పల్మనాలజిస్ట్ డాక్టర్ ఈ రవీందర్రెడ్డిని సతీశ్రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో చెస్ డైరెక్టర్ డాక్టర్ జగన్నాథ నాయక్ తదితరులు పాల్గొన్నారు.