హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): బీసీల హక్కుల సాధనకు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు 30 ఏండ్లుగా చేస్తున్న కృషి ఎనలేనిదని సీబీఐ పూర్వ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కొనియాడారు. ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేదర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని రాజరత్న విద్యాసంస్థల ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావుకు ‘బీసీ యోధ’ పురస్కారాన్ని ప్రదానంచేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. మూడున్నర దశాబ్దాలుగా బీసీ హకుల సాధనకు ఉద్యమించిన నేతగా, ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీసీ కమిషన్ సభ్యుడిగా మూడు పర్యాయాలు, ప్రస్తుతం తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్గా వకుళాభరణం చేస్తున్న కృషిని కొనియాడారు. తొలుత ‘బీసీ కులగణన ఆవశ్యకత విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లపై ప్రభావం’ అనే అంశంపై వకుళాభరణం కీలకోపన్యాసం చేశారు. కార్యక్రమంలో అవార్డు ప్రధాత, రాజరత్న విద్యాసంస్థలు, ట్యూటర్స్ ప్రైడ్ అధినేత డాక్టర్ ఆర్బీ అంకం తదితరులు పాల్గొన్నారు.