రామగిరి, నవంబర్ 20 : కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రాజారాం యాదవ్ విమర్శించారు. ఆదివారం నల్లగొండలోని లయన్స్ క్లబ్ భవన్లో ‘కేంద్ర ప్రభుత్వం – రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో విష సంస్కృతిని ప్రవేశపెడుతూ మతం పేరుతో దేశంలో అరాచకాలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తిని నాశనం చేస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగ సంస్థ్ధలపై కేంద్రం ఆధిపత్యం చెలాయిస్తూ స్వలాభాలకు వాడుకుంటుందని దుయ్యబట్టారు.
బీజేపీలో చేరితే పదవులు, కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభాలకు గురి చేస్తున్నదని విమర్శించారు. విద్యార్థులు, మేధావులు స్పందించి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో సమన్వయం ఉండాలని, లేనిపక్షంలో అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను స్వలాభం కోసం వాడుకోవద్దని సూచించారు. ఓయూ జేఏసీ అధ్యక్షుడు అశోక్, నాయకుడు హరీశ్గౌడ్, గౌడ జేఏసీ చైర్మన్ సుంకరి మల్లేశ్ గౌడ్, టీఎస్జేఏసీ, సామాజిక, ప్రజా సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉద్యోగ, కార్మి క సంఘాల ప్రతినిధులు కూడా ప్రసంగించారు.