హైదరాబాద్ సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): జయ జయహే తెలంగాణ గీతాన్ని దళితులకు పాడే అర్హత లేదని కవి, గాయకుడు అందె శ్రీ తనతో అన్నారని కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురష్కార గ్రహీత డాక్టర్ పసూనురి రవీందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీన్నిబట్టి ఆయ న ప్రతిభ మేడిపండులా, అహంకా రం రాచపుండులా ఉన్నదని విమర్శంచారు. ఈ పాటను సంబండవర్గాల వారికి మాత్రమే పాడే హక్కు ఉన్నదని, దళితులకు లేదంటూ ఆయన కరాఖండిగా చెప్పారని, ఇది దళిత జాతిని అవమానించడమేనని పేర్కొన్నారు.
గత ఏప్రిల్లో జరిగిన సమూ హ సెక్యులర్ రైటర్స్ ఫోరం తరఫున వాగ్గేయకారులను ఆహ్వానించే బాధ్యతను తనకు అప్పగించారని, ఆ సమయంలో అందెశ్రీకి ఫోన్ చేసి కార్యక్రమానికి రావాలని కోరానని, ఆ సమయంలోనే ఆయన స్వయంగా తనతో ఈ గీతాన్ని పాడే హక్కు దళితులకు లేదని అన్నారని, చాలా పరుషంగా మాట్లాడారని తెలిపారు. పేరు వచ్చిందని దళితుడిగా చెప్పుకోవడానికి కూడా ఆయన ఇష్టపడటం లేదని పసునూరి రవీందర్ పేర్కొన్నారు.