హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జిల్లాకో క్యాన్సర్ సెంటర్, మెడికల్ కాలేజీలు నెలకొల్పడం మంచి నిర్ణయమని ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ చికిత్స నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ప్రశంసించారు. హైదరాబాద్లో వైద్య సేవలు బాగున్నాయని కొనియాడారు. ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానలో నాణ్యమైన చికిత్సఅందిస్తున్నారని కితాబిచ్చారు. భవిష్యత్తులో బీపీ, షుగర్ మాదిరిగానే క్యాన్సర్ను పరిగణించే రోజులొస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలోని స్లోన్ కెటరింగ్ మెమోరియల్ క్యాన్సర్ సెంటర్ చైర్మన్గా, న్యూయార్క్లోని అత్యంత ప్రతిష్ఠాత్మక కార్నెల్వర్సిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దత్తాత్రేయుడు హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కళాశాల నుంచే పోస్టు గ్రాడ్యుయేషన్ చేయడం విశేషం. ఇటీవల హైదరాబాద్కు వచ్చిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని భయపడాల్సిన అవసరం లేదు. నిజానికి మనదేశంలో కేసులేమీ రెట్టింపు కాలేదు. అవగాహనలేమి, నిర్ధారణ పరీక్షలు చేయకపోవడం వల్ల గతంలో క్యాన్సర్ను గుర్తించలేకపో యాం. ఇప్పుడు పరీక్షల ద్వారా క్యాన్సర్ను గుర్తించగలుగుతు న్నాం. అంతే తప్ప కేసులు వేగంగా పెరగడం లేదు.
మన దేశంలో క్యాన్సర్ కేసుల డాటా నిర్వహణ సరిగాలేదు. నిజంగా ఎన్ని కేసులున్నాయో ఎవరికీ తెలియదు. ముంబై, చెన్నైలోని డాటా ఆధారంగా అంచనావేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ పేరిట ఈ కార్యక్రమం ప్రారంభించారు. సరైన డాటా ఉన్నప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం.
క్యాన్సర్ రెండు రకాలు. ఒకటి అక్కడే వ్యాప్తి చెందేది, రెండోది ఇతర భాగాలకు విస్తరించేది. వైద్యులు చికిత్స ప్రారంభించడానికి ముందే దీనిని గుర్తించాలి. నేను ఈ విషయానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తాను. స్పష్టత లేకుండా కీమోథెరపీ ఇవ్వడం వల్ల లాభం ఉండదు. అన్నింటికీ ఒకే మంత్రం పనిచేయదు. నేను చాలెంజింగ్ కేసులనే తీసుకుంటాను. అన్ని దేశాల నుంచి నావద్దకు వస్తారు. క్యాన్సర్ వచ్చినప్పటికీ 20, 30 ఏండ్లు జీవించినవారి సందేశాలతో పుస్తకం తెచ్చాం. పేషెంట్లలో ధైర్యం నింపడం చాలా ముఖ్యం. ‘నేనున్నా’ అనే భరోసా ఇవ్వాలి. 90 శాతం తగ్గిస్తానని హామీ ఇవ్వాలి. ఈ విషయాలను ఆంకాలజిస్టులు గ్రహించాలి.
మన దేశంలో క్యాన్సర్ సోకిన భాగాలు తీసేస్తారనే భయం ఉన్నది. అది పాత పద్ధతి. ఇప్పుడు టెక్నాలజీ మారింది. క్యాన్సర్ వస్తే కాలు, చేయి, బ్రెస్ట్.. ఇలాంటివి తీసేయడం లేదు. ఇతర భాగాలకు ఇబ్బంది కలగకుండా వైద్యం చేస్తున్నారు. సింపుల్, అఫర్డబుల్, యాక్సెసబుల్ లక్ష్యంతో సరికొత్త చికిత్సలొచ్చాయి. గత పదేండ్లలో మాలిక్యులార్ ప్రొఫైల్ ఆధారిత చికిత్స వల్ల పేషెంట్లను వంద శాతం కాపాడవచ్చని గ్రహించాం. ఆ తర్వాత క్యాన్సర్ కణంలోని సిగ్నల్ వ్యవస్థను అడ్డుకోవడం ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని స్పష్టమైంది. ఇప్పుడు ఇమ్యునోథెరపీ గేమ్ చేంజర్గా మారింది. మూడు, నాలుగు స్టేజీల్లో ఉన్న వారిని కూడా రక్షించడం సాధ్యమవుతున్నది. అందరికీ ఒకేవిధమైన మందులు పనిచేయవు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. క్యాన్సర్ చికిత్సలపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో బీపీ, షుగర్ మాదిరిగానే క్యాన్సర్ను పరిగణించే రోజులొస్తాయి. చికిత్స ద్వారా క్యాన్సర్ను మేనేజ్ చేస్తూ, జీవితం గడిపే అవకాశం కలుగుతుంది.
ఇటీవల మంత్రి కేటీఆర్ను కలిసినప్పుడు చాలా విషయాలపై చర్చ జరిగింది. తెలంగాణలోని ప్రతి జిల్లాలో క్యాన్సర్ సెంటర్లు, మెడికల్ కాలేజీలు నెలకొల్పుతుండటం గొప్ప నిర్ణ యం. 35-40 ఏండ్ల నుంచి చూస్తున్నా.. ఇప్పుడు వైద్యరంగంలో హైదరాబాద్ ఎంతో ప్రగ తి సాధించింది. దేశంలోని ఇతర ప్రముఖ నగరాల్లో కంటే ఇక్కడ వైద్యసేవలు బాగున్నాయి. సిటీలోని కొన్ని దవాఖానలకు ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి పేషెంట్లు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా మద్దతిస్తున్నది. ఇక్కడ అద్భుతమై క్యాన్సర్ సెంటర్లున్నాయి. చారిటీ హాస్పిటళ్లు, కార్పొరేట్ హాస్పిటళ్లు, క్యాన్సర్ సెంటర్ల ఏర్పాటులో నా వంతు కృషిచేశాను. ఇది నాకెంతో గర్వంగా ఉన్నది. వైద్యరంగంలో తెలంగాణ పురోగమించేందుకు మంచి అవకాశాలున్నాయి. ప్రజల ఆరోగ్యంపై సమగ్ర సమాచారం ప్రభుత్వం వద్ద ఉండాలి. అమెరికాలోని కనెక్టికట్ స్టేట్ మాదిరిగా చర్యలు తీసుకోవాలి. అక్కడ క్యాన్సర్ డాటా పకడ్బందీగా నిర్వహిస్తారు. దీనితో మంచి ఫలితాలు సాధిస్తున్నారు.
ప్రాథమిక అవగాహన, త్వరగా నిర్ధారణ, సకాలంలో చికిత్స.. ఈ మూడు అంశాలపై సమాన దృష్టిసారిస్తేనే క్యాన్సర్ను జయించగలం. మనదేశం మొదటి రెండింటిలో చాలా వెనుకబడింది. ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు చికిత్స మీదనే దృష్టి పెడుతున్నాయి. ఇలా చేస్తే ఎప్పటికీ క్యాన్సర్ పెరుగుదలను అడ్డుకోలేం. కొత్త ట్రీట్మెంట్ సెంటర్లు పెట్టుకుంటూ పోవడం, జీవితాంతం చికిత్స అందించడానికే సరిపోతుంది. క్యాన్సర్ను మొదటి రెండు అంశాల వద్దనే ఆపాలి. టర్న్ ఆఫ్ ది స్విచ్ ఇన్ ఫస్ట్ ఇంటర్వెన్షన్. సిగరేట్, బీడీలు, చుట్టలు తాగటం, పొగాకు నమలడం వల్ల క్యాన్సర్ వస్తుందనే అవగాహన కల్పించాలి. గర్భాశయ ముఖ ద్వారం క్యాన్సర్ వల్ల మన దేశంలో రోజుకు 200 మంది మహిళలు చనిపోతున్నారు. ఇది ప్రమాదకర సంకేతం.